హోమ్

2, మే 2012, బుధవారం

సుభోజనుని కథ


              ఎప్పటి లాగే భోజనాలు ముగిసాక శౌనకాది మహా మునులు సూత మునితో ముచ్చట్లు పెట్టారు. అలవాటు ప్రకారం సూత ముని ఏదో ఒక కథ చెప్పబోయాడు. ఆంతలో ఒక యువ ముని లేచి, మహానుభావా మీరు ఎన్నో విషయాలు, విశేషాలు, వ్రతాల గురించి  ఎన్నో ఏళ్ళుగా మాకు చెబుతున్నారు అలాగే ఈ రోజు నా సందేహాన్ని మీరు నివృత్తి చేయవలసింది అని ప్రార్థించాడు.
సందేహం:               చాలామంది మానవులకి ఏదైన పని మీద బయటకి పోవుటకు ముందు, దీర్ఘశంక తీర్చుకునే అలవాటు వుంది. ఇది ఒక్కొక్కసారి వారికి చాలా ఆటంకం గా పరిణమిస్తోంది. దీని వల్ల ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి ఆలస్యం గా వెళుతున్నారు.అసలు ఈ ఆలవాటు ఎలా వచ్చింది?దీని కష్టాల నుండి మానవులకి విముక్తి వున్నదా? సూత ముని ఒక చిరునవ్వు నవ్వి, నాయనా! విను.                   
పూర్వము సుభోజనుడనే రాజు ఉండేవాడు. అతడు సకల విద్యా పారంగతుడు మరియు తపోధనుడు. కానీ పేరు కి తగినట్లుగానే భోజన ప్రియుడు. ఎంత ప్రయత్నము చేసిననూ జిహ్వ చాపల్యము మాత్రం అతనిని వీడినది కాదు. ముందు చేసిన తపములన్నిటి కంటే గొప్ప తపస్సు చేసి దీనిని వదిలించు కొనవలెనని సంకల్పము చేసి, తపము ఆరంభిచెను.కొన్ని ఏండ్లు గడిచినవి, ఇంతలో ఈ వార్త విన్న మహేంద్రునికి పదవీ గండ భయం పట్టుకున్నది. ఎప్పటివలెనే ఎవరో ఒక గంధర్వ కన్నె ను పంపి తపోభంగం కావించ సంకల్పించెను. అప్పుడు నారదుడు "మహేంద్రా! సింహానికీ, ఎలుకకీ ఒకే బోను వాడటం సబబు కాదు. సుభోజనుడు తపోసంపన్నుడు, అతడి తపోభంగానికి అతని బలహీనతనే వాడుకొమ్మ"ని సలహా ఇచ్చాడు.                       
మహేంద్రుడు వెంటనే పంచ భక్ష్య పరమాన్నాలు, నవ కాయ పిండి వంటలు చేయించమని  పురమాయించాడు.  భోజనం పూర్తి అయిన వెంటనే మళ్ళీ సుభోజనుడు తపస్సు ప్రారంభిస్తేనో? అనే సందేహం అతనికి కలిగింది. ఆందుకని ఆ వండే వంటల్లో అతి విరేచనకారి అయిన ఒక మూలిక కలపమని అదేశించాడు. ఈ మూలిక వల్ల  సుభోజనుడు మృత్యు ముఖం చూస్తాడు మళ్ళీ మహేంద్ర పదవి కోసం తపస్సు చేయటానికి సాహసించడు, ఇదీ మహేంద్రుని యోచన. అనుకున్న పధకం ప్రకారం అన్నీ తయారు చేయించి ఒక గంధర్వుని చే పంపించాడు. మహేంద్రుని పధకం పారింది. సుభోజనుడు ఆ ఆహారాన్ని సేవించాడు. వెను వెంటనే విరేచనాలు ప్రారంభమయ్యాయి. నీరసించి పోయాడు. దీనితో కోపోద్రిక్తుడై, "ఓయీ గంధర్వా! మానవ జన్మ లోని బలహీనతను ఉపయోగించుకొని నా తపస్సుకి భంగం కలిగించావు కనుక నీవునూ మానవ జన్మ నెత్తి, ఇదే విరేచనము చే నీకూ, నీ వంశజులకూ సకల  కార్యములకు భంగము కలుగుచూ , నానా విధములగు కష్టములను అనుభవించెదరు గాక" అని శపించాడు.   యువ ముని ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఏమైనా సందేహమా నాయనా అన్నాడు సూత ముని. "శాపవిముక్తి మార్గం ఏదైనా వున్నదా స్వామీ?" "లేకేమి నయనా! ఈ కథ విన్న, చదివిన ఆ గంధర్వుని వంశజులు అందరికీ శాపవిముక్తి కలుగుతుంది" యువ ముని కళ్ళు జ్ఞానం తో వెలిగాయి. "మా వంశ మూల పురుషుని వివరాలు తెలిపినందుకు, చాలా సంతోషం గా వుంది మహానుభావా!".

ఈ కథ కేవలం కల్పితం అని వేరే చెప్పాల్సిన అవసరం లేకపొయినా, ఈ కథ కల్పితం మరియు హాస్యం కోసం మాత్రమే వ్రాయబడింది. ఎవరి మనో భావాలనీ కించపరచాలని కాదు అని నా మనవి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి