హోమ్

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పర నింద , ఆత్మ స్తుతి

                         ఏలిన వారు చిద్విలాసం గా టివి చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఏలిన వారి ఆశ్రిత పక్షపతాన్ని, కుంభకోణాల్నీ ఎండగడుతూ, గతం లో తమ పాలన లో దేశం ఎంత వెలిగిపోయిందో చెప్పుకుపోతున్నాడు. పక్కగా నిలబడ్డ భృత్యుడికి అనుమానం వచ్చింది, ఏలిన వారు ప్రతిపక్షం వాడు బండబూతులు తిడుతుంటే ఎలా ఆస్వాదిస్తూ  చూస్తున్నారా అని.అదే అడిగాడు. ఆయన మళ్ళీ ఒక చిరు నవ్వు విసిరి, "పిచ్చివాడా వాడు తిడుతున్నది నన్ను కాదు, రాజకీయాన్ని" అన్నాడు. అర్ధం కానట్లు చూశాడు. ఏలిన వారు అనుగ్రహ భాషణం మొదలు పెట్టారు, "నేడు పాలకుడికి ఉండవలసిన లక్షణాలలో పరనింద, ఆత్మస్తుతి ముఖ్యమైనవి. వీటి గురించి మహాభారతం లో చెప్పబడిన కథ నీకు చెబుతా విను".                          
 కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఒకానొక రోజు కర్ణుడు ధర్మ రాజుని తీవ్రం గా గాయ పరిచి, తల్లి కిచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు. ధర్మరాజు అవమాన భారం తో శిబిరానికి చేరాడు. అన్న గారు అర్ధంతరం గా శిబిరానికి వచ్చాడని తెలిసి, అర్జునుడు అన్న గారిని కలిసి విషయం అడిగాడు.  ధర్మరాజు కోపోద్రిక్తుడై "అర్జునా కర్ణుని చే తీవ్ర గాయాల పాలై  వచ్చాను. గతం లో నీవు చేసిన ప్రతిజ్ఞ కి కట్టుబడి వెంటనే కర్ణుని సంహరించు లేదా నీ గాండీవాన్ని వేరెవరికైనా ఇచ్చి నువ్వు తప్పుకో" అన్నాడు. వెంటనే అర్జునుడు కత్తి తీశాడు.అప్పుడు శ్రీకృష్ణుడు "ఇక్కడెవరూ శత్రువులు లేరే, ఎవరి పైకి ఈ కత్తి" అన్నాడు.అందుకు కిరీటి "కృష్ణా నన్నూ నా గాండీవాన్నీ వేరుచేసి ఎవరైనా మాట్లాడినా, గాండీవాన్నిఎవరైనా గేలి చేసినా వారిని చంపుతానని మనసు లోనే నేను ఒక శపధం చేసుకున్నాను. అందుకు ఇప్పుడు అన్నగారిని చంపబోతున్నాను " అన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుని శాంతపరచి ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. పెద్దలు,పూజ్యులు అయిన వారిని అకారణంగా నిందించిన మాత్రమున వారిని హతమార్చినట్లే. కనుక సత్య ధర్మ పరాయణుడైన ధర్మజుని నిందించి నీ శపధం నేరవేర్చుకోమన్నాడు. అర్జునుడు అన్నగారు చేసిన మంచి పనులన్నిటినీ చెడు పనులుగా చిత్రీకరించి అన్నగారిని దూషించాడు.                         
వెంటనే అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ ఏమయిందన్నాడు. "ఎవరి వలన మేము ఇంతవారమైనామో,ఎవరి సత్య ధర్మ నిష్ఠలు భావితరాలకు ఆదర్శప్రాయమో అట్టి అన్నగారిని నిందించి నేను ధర్మము తప్పాను. నా బ్రతుకు వ్యర్ధం, అందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను" అన్నాడు. అప్పుడు కృష్ణుడు మరొక ధర్మసూక్ష్మం చెప్పాడు. "ఆత్మ స్తుతి ఆత్మహత్యా సదృశం కనుక నీవు చేయని మంచి పనులని నీవే చేసినట్లుగా భావించి నిన్ను నువ్వే స్తుతించుకో" మన్నాడు.                
కాబట్టి ఎలాంటి కుంభకోణం అయినా, సమస్య అయినా మనం చేయవలసిందల్లా ప్రతిపక్షం వాడిని తిట్టడం, మన పాలనని మనమే పొగుడుకోవడం, తద్వారా సమస్యని పక్క దారి పట్టించడం. భృత్యుడు అయోమయంగా చూశాడు. "మరి ప్రతిపక్షం వాడూ ఆ పనే చేస్తున్నాడు కదా" అన్నాడు. 
ఏలిన వారు ధర్మ సూక్ష్మం చెప్పసాగారు.  అందరూ ఆత్మ స్తుతి వల్లనో పరనింద వల్లనో ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు మిగిలింది రాజకీయమే. రాజకీయానికి వ్యక్తులతో ప్రమేయం లేదు. మరి ప్రజలో అన్నాడు. ఏలిన వారి నవ్వు, ధర్మో రక్షతి రక్షిత: అన్నట్లుగా తోచింది. భృత్యుడి మొహం విప్పారింది.