హోమ్

11, మే 2012, శుక్రవారం

జోగినాధం కథలు:రుబ్బు-చీదు బడి (1)


జోగినాధం ఒక పేద కుటుంబం లో పుట్టి, పల్లెటూళ్ళో పెరిగాడు. జోగినాధం తండ్రి రమేషు ఎన్నో వ్యయప్రయాసల కి ఓర్చి జోగినాధాన్ని రుబ్బు-చీదు బడి లో చేర్చాడు. ఆ బడి కాన్సెప్టు అలాంటిది మరి. అక్కడ పాఠాలని ముందుగా రుబ్బించి, పరీక్షల ముందు పిల్లల తలలకి పట్టిస్తారు. సరీగ్గా పరీక్షల టైము కి పిల్లలు ఆన్సరు పేపరు మీద పాఠాలన్నీ చీదేస్తే మంచి మార్కులు వస్తాయి. ఈ విధానం లో రుబ్బు-చీదు బడి వాళ్ళు అప్పటికే మంచి పేరు సంపాదించారు. 
                 జోగి ఆరో తరగతిలో ఉండగా ఈ బళ్ళో చేరాడు. ఈ పెనుమార్పు అతడిని చాలా ప్రభావితం చేసింది. ఒక రోజు తనలాంటి మరి కొందరిని పోగేసి, ఆ ఊరి పెద్ద అయిన దత్తుడు గారి ఇంటి ముందున్న పెద్ద కుంకుడు చెట్టు దగ్గరికి కోతి కొమ్మచ్చి ఆడడానికి వెళ్ళాడు. కొంత సేపు ఆడుకున్నాక, దత్తుడు గారు వస్తున్నారని ఎవరో అరిచారు. ఆయన అంటే ఊళ్ళో అందరికి భయం, గౌరవమూ నూ. తోటి పిల్లలందరూ ఎటు వాళ్ళు అటు పారిపోయారు. అదే ప్రయత్నం చేయబోయిన జోగి మాత్రం చెట్టు కొమ్మ మీద నుంచి దబ్బున క్రింద, తర్వాత దత్తుడి గారి కంట్లోనూ పడ్డాడు.రుబ్బు-చీదు యూనిఫాం వేసుకున్న పిల్లలు ఆ ఊళ్ళో ఆడడం నిషేధం. దత్తుడు గారు అటుగా వస్తున్న సాంఘికం మాష్టారుకి ఫిర్యాదు చేసేరు.మర్నాడు సాంఘికం గారు  వేసిన అ సాంఘిక శిక్ష వల్లో, పదిమంది పిల్లలని చెడగొడుతున్నాడన్న పేరు వల్లో, జోగి ఇక ఆటల జోలికి పోకూడదని అనుకున్నాడు.
                  ఆ బళ్ళో కుదురుకోవడానికి జోగి కి చాలా రోజులు పట్టింది. అంతకు ముందు చదివిన దుంపల బళ్ళో డ్రిల్లు అనీ, ఆటలు అనీ, తోటపని అనీ పిల్లలని చదువుతో పాటు ఇతర విషయాలలో కూడా చురుగ్గా వుండేలా చేసేవారు. ముఖ్యం గా నెలకి ఒక సారి క్లాసు లో జరిగే క్విజ్  లో జోగి ఎప్పుడూ బాగా సమాధానాలు చెప్పేవాడు. మరి ఈ బళ్ళో ఆట మైదానం లేదు కనుక ఆటలు నిషేధం. మొక్కలు, చెట్లూ వగైరాలు లేవు కనుక ఇక ఉదయం ఏడు గంటల నుంచి  సాయంత్రం ఐదు గంటల వరకు రుబ్బుడు కార్యక్రమం వుండేది. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు రీడింగు క్లాసులు.వేసవి శెలవుల్లో అయినా తాత గారి   ఊరు వెళ్ళినప్పుడు ఆడుకోవచ్చు అనుకున్నాడు.కానీ మరుసటి సంవత్సరం ఏడో తరగతి పరీక్షలు కాబట్టి, శెలవలు రెండు వారాలే ఇచ్చారు. మిగతా రోజుల్లో స్పెషలు ప్రెపరేషను వుంది.తాతగారి ఊళ్ళో చిన్నప్పుడు త న బాబాయి దగ్గర జోగి క్రికెట్ నేర్చుకున్నాడు. ఈ సారి ఊరి జట్టూ తరపున మండలం స్థాయి పోటీలకి వెళ్ళాడు. అతనికి తనలో ఉన్న గొప్ప బౌలర్ అప్పుడే కనిపించాడు. ఎలా అయినా మన ఊరు వెళ్ళాక కూడా ఈ ఆట ఆడాలి అనుకున్నాడు.ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఊరికి దూరం గా ఉన్న దుంపల బడి పిల్లలతో ఆడేవాడు.ఊరి చివరి సంత కి ప్రతీ గురువారం వచ్చే సాంఘికం గారికి మళ్ళీ దొరికి పోయేడు.ఈ సారి సాంఘికం గారు పెద్ద లెక్చరు దంచారు.తను బాగా చదువుతాడనీ, ఇలా పనికిమాలిన విషయాలని దూరంగా పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టి పదోక్లాసు లో గొప్ప మార్కులు తెచ్చుకోవాలనీ, రుబ్బు-చీదు పరువు ప్రతిష్టలు పెంచాలనీ చెప్పేరు. జోగి లో ఆయన కి కాబోయే ఐఏఎస్ ఆఫీసరు కనిపిచాడు. జోగి ని ఎలా అయినా సరైన దారిలో పెడదామని ఆయన జోగి మీద నిఘా కూడా పెట్టారు. ఓ ఆదివారం సాయంత్రం క్రికెట్  ఆడడం కోసం వెళుతున్న జోగి ఆయనకి దొరికిపోయాడు. ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నా, మరోసారి గ్రౌండు లోనే దొరికి పోయాడు. క్రికెట్  వల్ల ఉపయోగం లేదని, ఇంగ్లీషు సార్ తో ఛెస్ ఆడితే బుర్ర పదునై ఏడో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి ఉపయోగపడుతుందని చెప్పటమే కాక, ఇంగ్లీషు సార్ తో ఒప్పందం కూడా చేసేరు ప్రతీ ఆదివారం జోగి తో ఛెస్ ఆడాలని. అలా దేశం ఒక మంచి బౌలర్ ని కోల్పోవడానికి తన వంతు సాయం అందించారు సాంఘికం గారు. క్రికెట్ తీవ్రవాదం కన్నా ఘోరమైన నేరం (ఈ బళ్ళో) అని గ్రహించిన జోగి, చేసేదేమీ లేక ఛెస్ ఆడడం నేర్చుకున్నాడు.మిగతాది మరో టపాలో ...

7, మే 2012, సోమవారం

ఇల్లు ఇరుకటం ఆలి మరుకటం

తెలుగు లో ఉన్న జాతీయాలని మన తరం వారు ఎంత వరకు అర్ధం చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను పొరబాటుగా అర్ధం చేసుకున్న ఈ జాతీయాన్ని తలచుకోగానే ఒక సంఘటన గుర్తు వస్తుంది. 
1992 లో విడుదలైన చిత్రం భళారే విచిత్రం సినిమా లో బ్రహ్మచారులం కర్మ వీరులం అనే పాట వుంది. అందులో ఈ జాతీయాన్ని వాడారు. అప్పటి నా వయసు కి, అనుభవానికీ, తెలివితేటలకీ నేను 'పట్నాలలో ఇళ్ళు ఇరుకుగా వుంటాయనీ, ఆలి కోతిలాగా (మర్కటం) వుంటుంద 'నీ కవి భావం అనుకున్నాను. కామెడీ సినిమా కనుక అప్పటికి ఆ భావం సబబుగానే తోచింది.ఇది జరిగిన చాలా ఏళ్ళ తరువాత అంటే నాకు పెళ్ళైన కొత్తలో మేము బెంగళూరు లో వుండేవాళ్ళం. ఒక సారి మా బాబాయి ఏదో పని మీద బెంగళూరు వచ్చారు. మాటల మధ్య నేను ఇక్కడ ఇళ్ళు ఇంతే బాబాయ్ ఇల్లు ఇరకటం ఆలి మర్కటం లాగా ఇరుకు ఇల్లు అన్నాను. 
అందుకు ఆయన నవ్వి, దాని అర్ధం అది కాదురా అబ్బాయ్, చెబుతా విను అని, 
ఇలా చెప్పారు. ఇంటికి ఇరు కటం అంటే రెండు గుమ్మాలు ఉండాలనీ (ముందు ఒకటి వెనుక ఒకటి), ఆలి మరు కటం అంటే ఇల్లాలు తలుపు చాటున వుండి ఇతరులతో మాట్లాడాలనీ దీని అర్ధం. అప్పటి సమాజం లో అది సబబు గానే వుండేదేమో. ఇదండీ కథ.    

2, మే 2012, బుధవారం

సుభోజనుని కథ


              ఎప్పటి లాగే భోజనాలు ముగిసాక శౌనకాది మహా మునులు సూత మునితో ముచ్చట్లు పెట్టారు. అలవాటు ప్రకారం సూత ముని ఏదో ఒక కథ చెప్పబోయాడు. ఆంతలో ఒక యువ ముని లేచి, మహానుభావా మీరు ఎన్నో విషయాలు, విశేషాలు, వ్రతాల గురించి  ఎన్నో ఏళ్ళుగా మాకు చెబుతున్నారు అలాగే ఈ రోజు నా సందేహాన్ని మీరు నివృత్తి చేయవలసింది అని ప్రార్థించాడు.
సందేహం:               చాలామంది మానవులకి ఏదైన పని మీద బయటకి పోవుటకు ముందు, దీర్ఘశంక తీర్చుకునే అలవాటు వుంది. ఇది ఒక్కొక్కసారి వారికి చాలా ఆటంకం గా పరిణమిస్తోంది. దీని వల్ల ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి ఆలస్యం గా వెళుతున్నారు.అసలు ఈ ఆలవాటు ఎలా వచ్చింది?దీని కష్టాల నుండి మానవులకి విముక్తి వున్నదా? సూత ముని ఒక చిరునవ్వు నవ్వి, నాయనా! విను.                   
పూర్వము సుభోజనుడనే రాజు ఉండేవాడు. అతడు సకల విద్యా పారంగతుడు మరియు తపోధనుడు. కానీ పేరు కి తగినట్లుగానే భోజన ప్రియుడు. ఎంత ప్రయత్నము చేసిననూ జిహ్వ చాపల్యము మాత్రం అతనిని వీడినది కాదు. ముందు చేసిన తపములన్నిటి కంటే గొప్ప తపస్సు చేసి దీనిని వదిలించు కొనవలెనని సంకల్పము చేసి, తపము ఆరంభిచెను.కొన్ని ఏండ్లు గడిచినవి, ఇంతలో ఈ వార్త విన్న మహేంద్రునికి పదవీ గండ భయం పట్టుకున్నది. ఎప్పటివలెనే ఎవరో ఒక గంధర్వ కన్నె ను పంపి తపోభంగం కావించ సంకల్పించెను. అప్పుడు నారదుడు "మహేంద్రా! సింహానికీ, ఎలుకకీ ఒకే బోను వాడటం సబబు కాదు. సుభోజనుడు తపోసంపన్నుడు, అతడి తపోభంగానికి అతని బలహీనతనే వాడుకొమ్మ"ని సలహా ఇచ్చాడు.                       
మహేంద్రుడు వెంటనే పంచ భక్ష్య పరమాన్నాలు, నవ కాయ పిండి వంటలు చేయించమని  పురమాయించాడు.  భోజనం పూర్తి అయిన వెంటనే మళ్ళీ సుభోజనుడు తపస్సు ప్రారంభిస్తేనో? అనే సందేహం అతనికి కలిగింది. ఆందుకని ఆ వండే వంటల్లో అతి విరేచనకారి అయిన ఒక మూలిక కలపమని అదేశించాడు. ఈ మూలిక వల్ల  సుభోజనుడు మృత్యు ముఖం చూస్తాడు మళ్ళీ మహేంద్ర పదవి కోసం తపస్సు చేయటానికి సాహసించడు, ఇదీ మహేంద్రుని యోచన. అనుకున్న పధకం ప్రకారం అన్నీ తయారు చేయించి ఒక గంధర్వుని చే పంపించాడు. మహేంద్రుని పధకం పారింది. సుభోజనుడు ఆ ఆహారాన్ని సేవించాడు. వెను వెంటనే విరేచనాలు ప్రారంభమయ్యాయి. నీరసించి పోయాడు. దీనితో కోపోద్రిక్తుడై, "ఓయీ గంధర్వా! మానవ జన్మ లోని బలహీనతను ఉపయోగించుకొని నా తపస్సుకి భంగం కలిగించావు కనుక నీవునూ మానవ జన్మ నెత్తి, ఇదే విరేచనము చే నీకూ, నీ వంశజులకూ సకల  కార్యములకు భంగము కలుగుచూ , నానా విధములగు కష్టములను అనుభవించెదరు గాక" అని శపించాడు.   యువ ముని ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఏమైనా సందేహమా నాయనా అన్నాడు సూత ముని. "శాపవిముక్తి మార్గం ఏదైనా వున్నదా స్వామీ?" "లేకేమి నయనా! ఈ కథ విన్న, చదివిన ఆ గంధర్వుని వంశజులు అందరికీ శాపవిముక్తి కలుగుతుంది" యువ ముని కళ్ళు జ్ఞానం తో వెలిగాయి. "మా వంశ మూల పురుషుని వివరాలు తెలిపినందుకు, చాలా సంతోషం గా వుంది మహానుభావా!".

ఈ కథ కేవలం కల్పితం అని వేరే చెప్పాల్సిన అవసరం లేకపొయినా, ఈ కథ కల్పితం మరియు హాస్యం కోసం మాత్రమే వ్రాయబడింది. ఎవరి మనో భావాలనీ కించపరచాలని కాదు అని నా మనవి.