హోమ్

9, ఆగస్టు 2016, మంగళవారం

పసిడి క్రాంతి

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (26/10/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?"

ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
పసిడి క్రాంతి
క్షమాజాలు నరికి నవసమాజాలు నిర్మించుకున్న పాపానికి,
నేడు వనాలన్నీ తాము దహనమౌతూ, మనిషినీ శిక్షిస్తున్నాయి.
ప్రకృతి కాంతని క్షోభ పెట్టినందుకేనేమో,
నేడు ఓజోన్ పొర ఆల్ట్రా వయొలెట్లను వర్షిస్తోంది.
నాడు విస్తరణ కాంక్షతో పరస్పరం చంపుకున్నందుకేనేమో,
నేడు హైటెక్ తుపాకీ లు వాటంతటవే విషాన్ని గ్రక్కుతున్నాయి.
ధనార్జన ఇంధనంతో నడిచే పరిశ్రమలపై క్రమ్మిన,
స్వార్ధమేఘాలు వర్షించి, వికసించిన అవినీతి ప్రసూనాలు
ఘ్రాణించీ,ఘ్రాణించీ రాటుదేలిన,
మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?
భావి తరాలు స్వేచ్ఛా సౌహ్రార్ధ్ర వాయువులు పీల్చేదెన్నడో?



8, ఆగస్టు 2016, సోమవారం

మకుటమౌదాం


ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"ఎదల నడుమ ఎల్లలు లేని 
మానవీయతకు మకుటమౌదాం.
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.
మకుటమౌదాం
ఎవరో ఎక్కడో ట్రిగ్గర్ నొక్కుతారు,
వేలకొలదీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలసి పోతాయి.
ఎక్కడో ఒక చోట ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాటం జరుగుతూనే ఉంటుంది.
అయినా భువన భవనంపై శాంతి బావుటా ఎగురుతూనే ఉంటుంది.
ప్రపంచం ఆర్ట్ గ్యాలరీలోని అన్ని చిత్రాల్లోనూ మృత్యువే.
అన్ని ముఖాలలోనూ భయమే.

ఒకే పుడమి ఒడిలో, ఒకే నింగి నీడన నిదురించే
ప్రపంచ ప్రజలారా రండి.
గతాన్ని మరచీ,
మతాన్ని పూడ్చీ,
ఎల్లలు దాటీ రారండి.

ఏకమౌదాం,
వసుధైక కుటుంబం లో మమేకమౌదాం.
మనసుంటే చూసీ, ప్రేముంటే పంచీ, సమైక్య జీవన సౌందర్యానికి  ప్రతీకలౌదాం.
'నేను నాద'నే తమో మేఘాల్ని చీల్చి, 'మనం' అనే ఉదయభానుణ్ణి వీక్షిద్దాం.
కలసి ఉంటే కానిదేమిటి? ఏకమైతే పోయేదేమిటి?
మదర్ చిరునవ్వు సాక్షిగా,
భువి పై శాంతిని ఆవాహనం చేద్దాం.
కలనైనా యుద్ధమెరుగని ప్రశాంతతకు చేరువౌదాం.
మచ్చుకైనా ఈర్ష్య దొరకని సచ్ఛీలతకు నెలవౌదాం.
ఎదల నడుమ ఎల్లలు లేని మానవీయతకు మకుటమౌదాం.
కరడు గట్టిన స్వార్ధ హృదయాలని బ్రద్దలు చేసి,
మరో ప్రస్థానానికి నాందీ వాచకం పలుకుదాం రండి.

ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.