హోమ్

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఎలుక తెచ్చిన తంటా

భారతీయ రైలు అంటే నాకు చాలా ఇష్టం. ఫస్టు క్లాసు లో ప్రయాణం చెయ్యాలని ఎప్పటినుంచో కోరిక కూడా. ఒకసారి ఆ కోరిక నేరవేరటమే కాక గుర్తు కూడా వుంది పోయింది. ఎలా అంటే...
రైలు బయలు దేరింది. విశాలమైన  బెర్తుల మీద  మేము పక్కలు ఏర్పాటు చేసుకుని, నిద్ర కి ఉపక్రమించాం. అంతలో  నా శ్రీమతి కెవ్వున కేక వేసింది, ఏమిటా అని ఆరా తీస్తే ఎలుక వచ్చింది అన్నది. ఈ గొడవకి అయిదు  ఏళ్ళ  మా సుపుత్రుడు కూడా నిద్ర లేచాడు. ఫస్టు ఎసి లోకి ఎలుక రావడం ఏమిటి అని నేను ఆమె మాటలని కొట్టిపారేసాను. అంతలోనే ఎలుక మళ్ళీ దర్శనం ఇచ్చింది. కూపే అంతా కలియ తిరుగుతూ ప్రళయ తాండవం చేసింది. నేను వెళ్ళి కోచ్ అటెండెంటు ని పిలిచుకుని వచ్చా. 'ఆయితే అది ఇక్కడ దూరింది అన్న మాట' అంటూ అతను వచ్చి వేట మొదలు పెట్టాడు. ఎలుక చాలా పోరాడి, చివరకు అతగాడికి మస్కా కొట్టింది.  అతను దుప్పటి ఒకటి కూపే తలుపు కి అడ్డు పెట్టి, 'ఇంక రాదులే సారూ' అని తప్పుకున్నాడు. వేరే బెర్తులు కూడా ఖాళీ లేక పొవడం తో మేము ఆ కూపే లోనే వుండాల్సి వచ్చింది. ఇక తెల్లవార్లూ ఎలుక తో యుద్ధం సాగుతూనే వుంది. డబ్బూ పొయే శనీ పట్టే అన్నట్లు, మా ప్రయాణం లో ఆ రాత్రి అంతా జాగారమే.
ఈ తతంగం అంతా చూస్తూ మా సుపుత్రుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాడు. వాడిక్కూడా ఈ ప్రయాణం బాగా గుర్తు వుంటుంది. ఇంత జరిగినా కూడా భారతీయ రైలు అంటే నాకు ఇష్టం మాత్రం తగ్గలేదు.

5, ఏప్రిల్ 2012, గురువారం

ఆన్నమయ్య తమాషా

             దర్శకేంద్రుని అన్నమయ్య చిత్రం చూసాక చాలా మంది నా లాంటి వాళ్ళకి, అన్నమయ్య గురించి తెలిసింది. సంతోషించాల్సిన విషయమే. దానికి సంబంధిచిన ఒక తమషా ఏమిటంటే..
              ఆన్నమయ్య గురించి భావితరాల కి తెలియాలనే సదుద్దేశ్యం తో మన ప్రభుత్వం వారు తెలుగు వాచకం లో ఒక పాఠ్యాంశంగా అన్నమయ్య ని చేర్చారు. పాఠం  చివర ఉపాధ్యాయునికి ఇచ్చిన సూచనల్లో, మరికొన్ని అన్నమయ్య పాటలు సేకరించి పిల్లలకు నేర్పమని ఉంది. ఆందుకని ఒక ఉపాధ్యాయుడు రెండు పాటలు నేర్పించారు తన క్లాసు పిల్లలకి. చివరగా పిల్లల్లొ ఎవరికైనా ఇంక వేరే పాటలు తెలుసేమో కనుక్కుందామని ఆరా తీసారు..అప్పుడు ఒక బుడుగు నాకు ఒక పాట తెలుసు సార్ అని , ఇదిగో ఈ పాట అందుకున్నాడు..
                అస్మదీయ మగటిమి, తస్మదీయ తకధిమి.. 
అది సినిమా పాట అని ఆయన ఎంత చెప్పినా ఆ బుడుగు కన్విన్సు కాలేదట.

4, ఏప్రిల్ 2012, బుధవారం

రంగుల మాయాబజార్

                    నా చిన్నప్పటి  నుంచి మాయాబజార్ సినిమా చాలా సార్లు చూసాను. కానీ రెండు ఏళ్ళ క్రితం రంగుల్లో చూసిన మాయాబజార్ మాత్రం మరపు రానిది. పాత సంగతే అయినా, ఇప్పటికీ మనసు లో తాజా గా వున్నజ్ఞాపకం ఇది.2004 లో మొఘుల్-ఎ-ఆజం రంగులలో వచ్చినప్పుడు నేను చూసాను కానీ అంతకు ముందు ఆ సినిమా నేను చూడక పోవడం వల్ల నాకు అంత గొప్పగా అనిపించలేదు (ఆ చిత్రాన్ని కించ పరచడం నా ఉద్దేశ్యం కాదు.). కానీ చిన్నప్పటినుంచి ఎన్నో సార్లు నలుపు తెలుపుల్లో చూసిన మాయాబజార్, తెలుగు సినిమా స్క్రీన్ ప్లే కే తల మానికమైన మాయాబజార్,  ని రంగుల్లో చూడడం ఒక మధురానుభూతి ని ఇచ్చింది. ఈ చిత్ర రాజాన్ని నిర్మించిన విజయా వారు చిరస్మరణీయులు. 53 ఏళ్ళ తరువాత రంగుల్లో కి మారుస్తారని అప్పటికి వాళ్ళకి తెలియక పోయినా, రంగుల్లో కూడా అద్భుతం గా ఉండేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని.
                    హాల్లో  కి వెళ్ళే ముందు, అంతా ఆ తరం వాళ్ళే వుంటారేమో అనుకున్నాను కాని హాలంతా పిల్లలు, యువతరం తో నే నిండి వుంది. మహానటి సావిత్రి, రేలంగి, యస్వీఆర్ పాత్రలు  తెర పై ప్రవేశించగానే జనం లేచి చప్పట్లు కొట్టారు. ఏ గ్రాఫిక్సూ లేని ఆ రోజుల్లో చేసిన గిమ్మిక్కులన్నీ చూడడానికి చాల బాగున్నాయి. మా కుటుంబం లోని పెద్దలంతా ఆ రోజులని తలచుకుని మురిసి పోయారు మరి పిల్లలైతే ఒకటే కేరింతలు ఘటోత్కచుని మాయాజాలం చూసి. అలనాటి చిత్రం లోని కొన్ని సన్నివేశాలు ఇందు లో లేవని తెలిసింది (రీలు కొంత మేర పాడవ్వడం వలన అట). కానీ ఈ తరానికి సరిపోయేలా రెండున్నర గంటలకి కుదించడం కూడా బాగుంది అది కూడా ఎక్కడా కధ లో లోటు తెలియకుండా. అక్కినేని , సావిత్రి ల జంట బహు ముచ్చట గా , టీనేజర్స్ లా వుంది అని కొందరు అనుకోవటం కూడా నా చెవుల పడింది.             
                    అలనాటి గొప్ప సినిమాలు ఇంకా కొన్ని రంగుల్లో వస్తే ఎంత బాగుంటుంది!!