హోమ్

సాంఘికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాంఘికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఆగస్టు 2023, మంగళవారం

పిచ్చి కి లోకం దాసోహం!!

ఆ రోజు ఆదివారం. అప్పుడే జానెడు పొద్దెక్కింది. సుబ్బారావు నిద్ర లేచి చుట్టూ చూసాడు. 

మామూలుగా సుబ్బారావు ఆదివారం బారెడు పొద్దెక్కితే గానీ లేవడు. కానీ ఇటీవల సెల్ఫీ విషయం లో వివాదం జరిగాక, సుందరి చేసిన వికటాట్టహాసం గుర్తు వచ్చి నిద్ర సరిగా పట్టట్లేదు సుబ్బూకి.

సుందరి జాడ లేదు ఇంట్లో. ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళిందబ్బా అనుకుంటూ ఇల్లంతా కలియ తిరిగాడు. ఎక్కడా కనపడక పోయే సరికి, ఫోన్ చేద్దామని సెల్ చూస్తే ఓ మెసేజి.

"సుబ్బూ, ఈ సెలబ్రిటీ బతుకు చాలా కష్టం. ఫ్యాన్స్ కోసం పొద్దున్నే లేచి, పార్క్ కెళ్తున్నా, ఇన్‌స్టా లో మంచి పక్షుల ఫోటో లు పెడతానని మాటిచ్చా"

ఆకలి వేసి పొట్ట తడుముకున్నాడు. మెసేజి ఇంకా వుంది.

"నాకు తెలుసు నీకు ఆక లౌతుందని ... ఏదో ఒకటి వండి ఉంచు"

ఛఛా!  దీని సెలబ్రిటీ పిచ్చ పాడు గానూ, సండే కూడా నేనే వండాలన్న మాట. పైకే అనుకున్నాడు.

కానీ ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో సుందరి ని ఏమీ అనే ధైర్యం లేదు.

ఆ రోజు సోమ వారం ..

మళ్ళీ అదే సీన్. సుబ్బు లేచి చుట్టూ చూసాడు. దీని తిక్క తగలెయ్య.. వీక్ డే కూడా ఫ్యాన్సేనా ..అనుకుంటూ చుట్టూ వెతికాడు.

అంతలో కిచెన్ లో వండుతూ కనపడింది.

ఇవాళెవడో చచ్చాడన్నమాటే అనుకుంటూ సుందరి దగ్గరకు వచ్చి, పళ్ళికిలిస్తూ .."ఏంటి పొద్దున్నే కష్టపడుతున్నావ్?" అన్నాడు.

"నువ్వే చూడు" అంది సుందరి చిలిపిగా.

ఒక్కసారి అదిరిపడ్డాడు. విచిత్రమైన వంటేదో కనపడుతోంది.

"ఏమిటీ ఘోరం" అందామనుకున్నాడు కానీ తమాయించుకుని,

"సుందూ నేనంటే నీకెంత ప్రేమ, నా కోసం ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్ వండుతున్నావా?" అన్నాడు లేని పోని భావాలేవో ఒలికిస్తూ. ఈ మధ్యనే ఇలా నటించడం అలవాటు చేసుకున్నాడు.

"ఇదా. మంగోలియన్ సలాడ్, నీ హెల్త్ కి మంచిదనీ" అంది సుందరి.

"కానీ నేనలాంటివి తినను కదా" అందామనుకున్నాడు కానీ 'హింస సెంటిమెంటు సమపాళ్ళలో' మాట గుర్తు వచ్చి,

"నా ఆరోగ్యం పట్ల నీకెంత కేర్" అన్నాడు.

"కేరా పాడా, నీ ఫామిలీ పేక్ - సిక్స్ పేక్ అవ్వాలని, రెడీ అయ్యి రా, ఇద్దరం కలిసి .." అంటుండగానే, సుబ్బూ రెడీ అవడానికి వెళ్ళిపోయాడు సంతోషంగా.

రెడీ అయ్యి తిరిగొచ్చి చూస్తే, సుందూ బ్రేక్‌ఫాస్ట్ నీట్ గా ఎరేంజ్ చేసి ఫోటో లు, సెల్ఫీలూ తీస్తోంది. ఇక ఇది ఇప్పట్లో తేలే యవ్వారం కాదనుకొని, ఆఫీస్ కి బయలు దేరుతుండగా సుందూ అంది.

"సుబ్బూ ఇవాళ టిఫినేం వండావ్?"

"అదేంటి నువ్వు చేసావ్ గా"

"అయ్యో పిచ్చి సుబ్బూ. ఇది తినడానికి కాదమ్మా. ఊరికే ఇన్‌స్టా లో, ఫేస్‌బుక్ లో పెట్టడానికి. సెలబ్రిటీ లు ఇలాంటివే తింటారని ఫ్యాన్స్ అనుకోవాలి."

ఇంకా ఫొటో లు తీస్తూనే అంది.

"నీకేం తెలుసు బాబూ మా సెలెబ్రిటీ ల కష్టాలు, ఇవాళ్టికి ఎదో ఒకటి వండేద్దూ"

"ఈ సోషల్‌నెట్‌వర్క్ ని కనిపెట్టిన వాడిని కత్తితో నడ్డి మీద షూట్ చేసి పారెయ్యాలి" కసిగా మనసులోనే అనుకుంటూ కిచెన్ లోకి పోయాడు.

ఇంకో రోజు ...

"ఈ మధ్యేంటి వంటింట్లో ఎక్కువగా ఉంటున్నావ్? .  నాకోసం ఏమైనా స్పెషల్స్ వండుతున్నావా?" ఆనందంగా అడిగాడు సుబ్బూ.

"నా సెలబ్రిటీ హోదాకి తగ్గట్టు రోజుకో కొత్త వంట చేసి, ఇన్‌స్టా లో నూ, ఫేస్‌బుక్ లో నూ పెడతానని ఇప్పుడే ఎఫ్ బి లైవ్ లో ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేసా" అంది బిజీ గా ఏదో చేస్తూ.

"నీ సెలబ్రిటీ పిచ్చి కాదు గానీ, ఇదొక్క మంచి పని చేస్తున్నావ్.."

"సుబ్బూ. అన్నట్టు ఈ ఫోటో చూడు, ఇన్‌స్టా లో దుమ్ము లేపడానికి మొన్న సండే నాడు తీసా."

"ఏంటే ఇదీ. రెట్ట వేస్తున్న కాకి లా ఉందే?"

"ఎంత బావుందో కదా. ఫోన్ ఫుల్ ఛార్జింగు లో పెట్టు, ఇది అప్‌లోడయ్యాక వచ్చే కమెంట్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఛార్జింగుండాలి కదా" అంది మురిసిపోతూ.

"ఇంతకీ ఏం వండుతున్నావ్?" అడిగాడు ఉత్సాహంగా.

"అరటి పండు తొక్కా, కొబ్బరి పీచూ, జీడిపప్పు తో బిస్కెట్స్ చేసా. పీచు పదార్దం, కార్బోహైడ్రేట్ ఇంకా ప్రోటీన్ సమ పాళ్ళలో ఉండే పౌష్టికాహారం. ఇదిగో రుచి చూడు, ఎంత బాగుందో" అదేదో హిందీ ఎడ్వర్టైజ్మెంట్ తెలుగు డబ్బింగులో అన్నట్టుగా అంది చిన్నగా సిగ్గుపడుతూ, నవ్వుతూ.

"దీని కంటే ఫోటో నే బెటరు." ఫోటో ని చూస్తూ అనుకున్నాడు మనసులో.

"ఇందాకా తెలియలేదు గానీ, నేషనల్ జాగ్రఫీ వాడు కూడా ఇంత అందం గా రెట్టవేస్తున్న కాకి ఫోటో తీసి ఉండడు. నీకు ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇచ్చే దాకా నిరాహార దీక్ష చేద్దామనుకుంటున్నా" అన్నాడు ఆవేశం, తెలివి కలగలిపి.

"నేనంటే నీకెంత ప్రేమ సుబ్బూ. అలాగే చేద్దువుగానీ, ముందు ఇది తిని అప్పుడు చెయ్యి." అంది అమాయకత్వం నటిస్తూ.

తినక తప్పలేదు సుబ్బూ కి.

ఇలాంటి చిత్ర విచిత్రాల మధ్య ఇంకో రోజు .

సుందరికి ఈ సోషల్‌మీడియా పిచ్చ తగ్గించాలంటే డాక్టర్ సలహా అవసరం అని నిశ్చయించుకున్నాడు సుబ్బూ. 

కానీ తనకీ విషయం చెపితే ఎలా రియాక్టవుతుందో నని భయం కూడా వేసింది.

అందుకే...

"సుందూ నువ్వు సెలబ్రిటీ అయిపోయిన ఆనందంలో నాకు నిద్ర పట్టక, బుర్ర పని చెయ్యక, మతిపోయి డిప్రెషన్ లో కెళ్ళేట్టున్నాను. ఒక సారి డాక్టర్ దగ్గరికెళ్దామా?" అడిగాడు దీనంగా.

"నా వల్ల నీకెంత బాధ సుబ్బూ, ఈ వీధిలోనే మన ఫాలోయరు ఒకాయన, మాంచి పిచ్చి డాక్టరుట, ఉన్నాడు పద ఈవెనింగ్ వెళ్దాం."అంది బాధగా.

"సుబ్బూ ఈ డాక్టరుకి ఎన్ని డిగ్రీలో చూసావా." అంది సంబరంగా.

DR ఫలానా, FBBS,TWTR,WTSP,INST,TKTK,YT

బోర్డు చూసి అదిరి పడ్డాడు సుబ్బూ. ఏదో తేడా కొడుతోందే అనుకున్నాడు.

"సుందూ ప్రాబ్లెం నాకే కదా నేను వెళ్ళి మాట్లాడి రానా" డ్రామా కంటిన్యూ చేసాడు సుబ్బూ.

ఆ డాక్టరుకి సుందూ విషయాలన్నీ చెప్పి, సుందరి కి కౌన్సిలింగు ఇవ్వమని వేడుకొని, కొంత సేపటికి బయటకి వచ్చాడు, డాక్టర్ తో సహా.

"పెద్ద సమస్యేం కాదండి, కొన్ని టిప్స్ పాటిస్తే తగ్గి పోతుంది." అన్నాడు డాక్టర్ సుందరి తో.

సుబ్బూ వైపు తిరిగి మళ్ళీ అన్నాడు.

"మీ విషయం నాకు సుందరి గారు ఆల్రెడీ చెప్పారు. నేనీవిడ పోస్టులన్నీ ఫాలో అవుతుంటాను. ఈ మధ్య చేసిన కొబ్బరి పీచు బిస్కట్ కూడా మా ఆవిడకి చేసి పెట్టాను. ఎంత బావుందో" 

పరవశించి పోయింది సుందరి.

"దీన్ని సోషలోఫోబియా అంటారు. " అన్నాడు డాక్టర్ కంటిన్యూ చేస్తూ.

"అంటే?"

"అంటే, ఈ వ్యాధి ఉన్నవాళ్ళు సోషల్ నెట్‌వర్క్ సైట్స్ చూస్తే చిరాకు పడిపోతారు. ఎప్పుడూ మనుషులతో డైరెక్టుగా మాట్లాడాలనుకుంటారు. వాట్సాప్, ఎఫ్ బి,ట్విట్టర్, ఇన్‌స్టా లాంటివి మాత్రమే వాడాలనే స్పృహ ఉండదు. ఇలాంటి వాళ్ళు నేటి సమాజానికి ఎంత ప్రమాదకరమో నా యూట్యూబ్ చానెల్ లో వివరం గా చెప్పాను. చూడండి."

"ఈయనేంటి నన్ను పేషంటనుకుంటున్నాడు" సుబ్బూ కి అంతా అయోమయం గా ఉంది.

సుబ్బూ కన్‌ఫ్యూజన్ గమనించి "రోజూ పొద్దున్న లేస్తూనే ఒక గంట ,రాత్రి పడుకునేముందు ఒక గంట ఫేస్‌బుక్, ట్విట్టర్ , వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం లు చూడండి. అలాగే రోజు కి మూడు సార్లు,  అర డజను సెల్ఫీ లు చొప్పున తీసుకోవాలి..కనీసం వంద వాట్సాప్ గ్రూపుల్లో చేరి, రోజూ గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజీ లు పెట్టాలి. కొన్నాళ్ళకి ఈ ఫోబియా తగ్గి పోతుంది. నన్నూ, సుందరి గారినీ ట్యాగ్ చెయ్యడం మరచిపోకండి. అలానే నా ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని, గంట కూడా కొట్టండి" ఒక ఫ్లో లో చెప్పుకు పోతున్నాడు.

"జబ్బు నాకు కాదు డాక్టర్ సుందరి కి అని చెప్పాను కదా." అన్నాడు సుబ్బూ జంకుతూ.

"ఆవిడకేమీ లేదండీ, ఇప్పుడందరూ ఇలానే ఉన్నారు. మీరే తేడా గా బిహేవ్ చేస్తున్నారు. అందుకని మీకే ఈ ట్రీట్‌మెంటు."

వీడు నీ ఫాలోయరు అని చెప్పినప్పుడే అర్ధం చేసుకో వాల్సింది. వీడూ సోషల్‌మీడియా పిచ్చోడేనా.

హతవిధీ!!

ఇప్పుడు నేనెక్కడికి పోవాలిరా మస్కూ, మార్కూ ..!! 


20, మార్చి 2022, ఆదివారం

భళారే స్వీయ చిత్రమా!

 జరిగిన విచిత్రాన్ని సుందరి కి చెబితే, థ్రిల్లు ఫీలవుతుందని మురిసి పోతూ ఇల్లు చేరాడు సుబ్బారావ్. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ మోగుతూ ఉండే కామెడీ చానల్ కూడా మూగ బోయింది. బుజ్జిగాడు ఆడుకోవడానికి బయటికెళ్ళినట్లున్నాడు.

సుందరి తన కళ్ళకి అరుంధతి లో అఘోరా లా కనపడుతోంది. అంతేకాదు "ఒదల సుబ్బారావ్ నిన్నొదల" అంటునట్లు ఇల్లంతా ఎకో వినబడుతోంది. ఈ మధ్య సుందరి కోపంగా వున్నప్పుడల్లా, అఘోరా మాటలు ఎకో లో వినబడడం అలవాటైపోయింది సుబ్బూ కి.
ఉపద్రవం ముంచుకు రాక ముందే సుందరి ని కూల్ చెయ్యాలనుకుంటూ, సుందూ ఇవాళేమైందో తెలిస్తే, భలే నవ్వు కుంటావ్ అని మొదలెట్టేశాడు, ఆమె వైపు కూడా చూడకుండానే.
ఆఫీసు నుండి కింద మన కార్ పార్క్ దాకా వచ్చానా, వెంఠనే ఒక ఇంపార్టెంటు ఈమెయిల్- బాసు నుంచి. ఆ మెయిలు చదువుతూ, మన ఫ్లోరుకొచ్చి,
హ్హి హ్హి హ్హి అని లేని నవ్వు తెచ్చుకుంటూ, మన ఇల్లనుకుని పక్కింటికెళ్ళిపోయా. అలవాటు ప్రకారం, సోఫా లో కూలబడి 'ఏమోయ్ టీ 'అనగానే, ఆవిడా పాపం, ఫేస్బుక్ చూసుకుంటూ టీ తెచ్చి ఇచ్చేసింది. మెయిలు కి రిప్లై ఇస్తూ, ఒక్క సిప్పు తాగానో లేదో, ఛీ యాక్ థూ అనిపించి కప్పు లోకి తొంగి చూసా. వాళ్ళాయన గ్రీన్ టీ తాగుతాడనుకుంటా. అప్పుడు తెలిసింది అది మనిల్లు కాదని. హ్హహ్హా హ్హా. భలేఉంది కదూ. ఆవిడా అంతే పాపం నవ్వుకుంటూ ఫేస్బుక్ చూస్తూ ఉండిపోయింది.
భలే తమాషా గా ఉంది కదూ? అంటూ సుందరి వైపు చూసాడు. ఇప్పుడు తను అఘోరా ని చంపబోతున్న అరుంధతి లా కనిపించింది.
ఇది కూడానా అంది, తన ఫోన్ చూపిస్తూ.
అదిరిపడ్డాడు సుబ్బు. ఆ పక్కింటావిడ తను కప్పు లోకి తొంగి చూస్తున్నప్పుడు, ఒక సెల్ఫీ తీసి, "టీ టైం విత్ మై మోస్ట్ లవ్డ్ ఒన్" అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసింది.
"ఎంత సెల్ఫీ అయితే మాత్రం, పక్కన ఎవరున్నారో చూసుకోనక్కర్లా? ఫేస్బుక్, సెల్ఫీ ఉంటే ఇంకేమీ పట్టదా? ఏం మనిషో? ఇప్పుడు నాకేమైనా జరిగితే ఎవరిది రెస్పా్న్సిబిలిటీ?" పైకే అనేసుకున్నాడు సుబ్బు.
పోస్ట్ చేసి పట్టుమని పది నిమిషాలు కూడా కాలేదు, ఇంకేమీ పని లేనట్లు జనమంతా విపరీతమైన కామెంట్లూ, లైకులూ ను.
కామేశం గాడి భార్య చీనాంబరి "లోల్" అనీ, సుబ్బు అక్క "నైస్ పిక్, చూడ ముచ్చటైన జంట" అని కామెంటి, సుందరినీ, సుబ్బూనీ ట్యాగ్ కూడా చేసింది. కొందరు ఫ్రెండ్సు "కంగ్రాచులేషన్స్" అని కూడా పెట్టేశారు.
"ఫ్రెండ్సు కి మన గురించి పూర్తిగా తెలియదనుకుందాం, మీ అక్క కేమైంది, చూడ ముచ్చటైన జంట అని పెట్టింది. ఆవిడగారికి నేనంటే ఎందుకింత పగ." అంది సుందరి నిష్ఠూరంగా.
"సుందూ మా అక్క కి తొందరెక్కువ అని నీకు తెలుసు గా, ఏదో పొరపాటున పెట్టుంటుంది" అన్నాడు సర్దిచెబుతూ.
"ఏదో మెయిలు కి రిప్లై ఇస్తూ .. అలా జరిగి పోయింది. ఇప్పుడే పక్కింటావిడ ని ఈ పోస్టు తీసెయ్యమని చెబుతా" అన్నాడు మళ్ళీ తనే.
"ఆ ముచ్చటా తీరింది, తన కెప్పుడూ ఇన్ని లైకులూ , కామెంట్లూ రాలేదుట, అందుకని తియ్యనని చెప్పేసింది" అంది సుందరి ఇంకా కోపంగా.
"సారీ సుందూ ఇంకెప్పుడూ ఫోన్ చూస్తూ ఇంటికి రాను సరేనా" అన్నాడు సుబ్బు.
"అంతే నీకు, మీ వాళ్ళకీ తప్పులు చెయ్యడం సారీ లు చెప్పడం అలవాటేగా. మొన్నటికి మొన్న, మీ బాబాయి చేసిన నిర్వాకం చాలదనట్టు మళ్ళీ ఇదొహటి" అంది సుందరి.
"సుందూ పాపం పెద్దవాడు, ఫేస్బుక్ అలవాటులేక .." అనబోతుండగానే
"అలవాటులేకా? మా మూడో మేనత్త మొదటి ఆడపడచు పాపం భర్త పోయి పుట్టెడు దుఃఖం లో ఉంటే, ఈయన గారు 'హలో పమ్మీ, హౌ ఈజ్ యువర్ హబ్బీ, హోప్ యు ఆర్ హేవింగ్ నైస్ టైం' అని పబ్లిక్ మెసేజీ పెట్టలేదూ? ఆవిడ నాకు ఫోన్ చేసి తిట్టిన తిట్లు నాకింకా చెవుల్లో మోగుతున్నాయ్." స్వరం పెంచింది సుందరి.
"సుందూ నీకెన్ని సార్లు చెప్పాలి. పాపం, ఆయన ఆ పమ్మీ గారి కొత్త గా పెళ్ళైన మనవరాలు అనుకొని ఆ మెసేజి పెట్టేడని. ఇద్దరి పేర్లూ ఒకటే కావడం తో ఏదో కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత సారీ మెసేజి కూడా పబ్లిగ్గానే పెట్టేడు కూడాను. అయినా మీ వాళ్ళేమన్నా తక్కువ తిన్నారా? చావు బతుకుల మధ్య ఐసీయూ లో ఉన్న మా పెద మావయ్య ని చూడడానికొచ్చి, మీ బాబాయి 'గుడ్బై మై ఫ్రెండ్' అని ఫోటో తో సహా పెడితే, పాపం ఆయన పోయేడనుకుని అందరు ఒకటే పరామర్శలుట. మా అత్త ఎంత బాధ పడిందనీ" కౌంటరిచ్చాడు సుబ్బు.
"సుబ్బూ అది ఆయన ఆర్నెల్లు అమెరికా లో ఉండడానికెళ్తూ బై చెప్పడానికి పెట్టిన పోస్టని నీకెన్ని సార్లు చెప్పాలి? అయినా, ఆ తర్వాత, ఈ పోస్టు వల్లనే దిష్టంతా పోయి , మా ఆయన క్షేమంగా తిరిగొచ్చాడంటూ , మా బాబాయి వాళ్ళింటికొచ్చి మరీ బట్టలు పెట్టి వెళ్ళారు కదూ మీ వాళ్ళు, ఆ మాట మరిచి పోయావా?"రిటార్డిచ్చింది సుందరి.
"మీ మావయ్య చేసిన ఘనకార్యం అప్పుడే మరచి పోయావా? మా చిన్నమ్మ మనవరాళ్ళతో తీసుకున్న ఫోటో పెడితే, ఆయన గారు, 'లుకింగ్ హాట్, కీప్ ఇట్ కూల్ అని కామెంటు పెట్టలేదూ?"ఛాన్సు వదలదలుచుకోలేదు సుబ్బూ.
"అదేదో ఎండాకాలం లో మిట్టమధ్యాన్నం ఎండ లో తీసిన ఫోటో లా ఉందని, పిల్లలకి కి జాగ్రత్త చెప్పాలనే సదుద్దేశ్యం తో, హాటు కి వేరే దిక్కుమాలిన మీనింగు ఉందని తెలియక ఇంగ్లీషు లో చెప్పాడే గానీ, ఆయన ఎంత మంచివాడో నీకు మాత్రం తెలియదూ?" అంది అంతే పంతం గా.
"ఎక్కడో బాబాయిలూ, మావయ్యలూ దాక వెళ్ళేను, అసలు మీ అమ్మ, నిన్ననే తన నూట డెబ్భయ్యో ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఫ్రెండు రిక్వెస్ట్ పెట్టింది. రోజూ పాస్వర్డ్ మరచి పోవడం, కొత్త ప్రొఫైల్ పెట్టడం. అదీ చాలదన్నట్లు ఈ వాట్సాప్ ఒకటి. బాదాం గింజలు తింటే మందబుద్ధి పోతుంది, కరివేపాకు తింటే మలబద్ధకం పోతుంది అంటూ దిక్కుమాలిన చిట్కాలు పంపడం, అడ్డమైన ఫార్వర్డ్ లు చెయ్యటం. నాకొక్క దానికే పంపుతోందట, కనుక్కున్నాను కూడా. కొంచం కూడా మేనర్స్ లేవు మీ వాళ్ళకి" కసురుకుంది సుందరి.
"అబ్బో మీ వంశం మేనర్స్ కి పెట్టింది పేరు మరి. ఎంత మీ నాన్న బాలయ్య అభిమాని అయితే మాత్రం, నా మనసింకా యంగే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని నా ఫ్రెండ్ భార్య కి రిక్వెస్ట్ పంపించాడు, పైగా బాలయ్య ప్రొఫైల్ పిక్ ఒకటి. ఈ వయసులో అవసరమా ఆయనకి ఈ కొత్త స్నేహాలు?”
"సుబ్బూ మా నాన్నని ఏమైనా అంటే ఊరుకోను"
"నువ్వు మాత్రం మా అమ్మ ని అనొచ్చా?"
"నీ ఫేస్బుక్ పేజ్ కరప్టైపోనూ"
"నీ వాట్సాప్ క్రాషైపోనూ"
"నిన్నసలూ"
“నిన్నసలూ"
ఇద్దరూ ఇలా యూ హౌ మచ్, అంటే యూ హౌ మచ్ అని ఈ-శాపాలు ఇచ్చుకుంటూండగా..బయటకెళ్ళిన బుజ్జిగాడు హడావుడిగా వచ్చాడు.
పక్కింటి ఆంటీ నాన్న తో పెట్టిన పోస్టు అపార్ట్మెంటంతా వైరల్ అయ్యిందట గా, అన్నాడు వగరుస్తూ.
కంగ్రాట్సు నాన్నా అనబోతుండగా,
పరిగెత్తుకుంటూ పక్కింటికెళ్ళి చూస్తే, అక్కడ ..
బుజ్జిగాడన్నట్లు గానే జనం గుమి గూడి ఉన్నారు. కానీ పెద్దగా అరుపులూ గట్రా లేవు. అపార్ట్మెంట్స్ లో అందరికీ టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వడం ఇష్టం లేదు సుందరి సుబ్బారావులకి. ఉన్నవాళ్లంతా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తమ తమ ఫోన్ల లోకి తొంగి చూస్తున్నారే తప్ప పెద్దగా హడావుడి కూడా లేదు.
బహుశా ఇన్స్టాగ్రాం లో లైవ్ చూస్తున్నారనుకుంటా అన్నాడు బుజ్జి గాడు. జరిగినది చాలదన్నట్లు, మళ్ళీ ఇదొకటా, అని నిలబడ్డ చోటే కూలబడ్డాడు సుబ్బూ.
అప్పటి దాకా నయానా భయానా చెప్పి చూసిన ఆంజినేయులు ఇప్పుడు తన భార్య మంగ తాయారుని బ్రతిమిలాడే స్టేజ్ కొచ్చాడు.
"తాయారు, ప్లీజ్, ఆ ఫోటో తీసెయ్యి. పక్కింటాయన్ని "మోస్ట్ లవ్డ్ ఒన్" అని నువ్వు అనడం వినడానికి, చూడడానికి, కనీసం తలచుకోడానికి కూడా బాలేదు."
"అంజీ, నాకు మాత్రం బాధ గా లేదనుకున్నావా? కాని నేనేమీ చెయ్యలేను. ఇప్పటికే ఎన్ని లైకులూ, కామెంట్లూ వచ్చాయో చూసావుగా. ఇప్పుడు తీసేస్తే , ఆ లైకులూ, కామెంట్లూ చేసిన వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయ్. నీ స్వార్ధం కోసం అంతమంది మనోభావాల్ని బలి తీసుకుంటావా?"
"ఈ మనోభావాలను కనిపెట్టిన వాడికి అరవ డబ్బింగు సీరియల్ ఆరు వేల ఎపిసోడ్లూ ఆపకుండా చూపించాలి." కసిగా తిట్టుకున్నాడు అంజి
"పోనీ కనీసం ఆ "మోస్ట్ లవ్డ్ ఒన్" ని "మోస్ట్ లవ్డ్ అన్న" అనైనా మార్చు" పట్టు వదల్లేదు అంజి.
"అంజీ, నాకు మాత్రం బాధ గా లేదనుకున్నావా? కాని నేనేమీ చెయ్యలేను..." తాయారు అదే డైలాగు రిపీట్ చేస్తూండగా.
"మేగీ (మంగ తాయారుని ఐస్ చెయ్యడానికి అప్పుడప్పుడూ ఇలానే పిలుస్తాడు అంజి) సీరియల్ లాగ రిపీట్ చెయ్యకు. ఎంత సెల్ఫీ అయితే మాత్రం పక్కన ఎవరున్నారో చూసుకోవద్దా?" గద్దించాడు అంజి.
"అసలు మన పెళ్ళి కాక ముందు మా పల్లెటూళ్ళో ఈ టెక్నాలజీ గొడవ లేకుండా హాయిగా ఉండేదాన్ని, ఎంగేజ్మెంట్ అవ్వగానే, నువ్వు కాదూ నాకు సెల్ఫీ కెమేరా ఉన్న ఫోన్ ఇచ్చింది? రోజూ నిన్ను చూడాలనిపిస్తోంది, రోజుకో
సెల్ఫీ పంపించమని, నువ్వు కాదూ నాకు ఈ దిక్కుమాలిన సెల్ఫీ జబ్బు అంటగట్టింది. ఇప్పుడు గంటకో సెల్ఫీ, అరగంటకో వాట్సాప్ స్టేటస్ , పూటకో ఫేస్బుక్ అప్డేట్ లేకుండా ఉండలేకపోతున్నాను. మన పెళ్ళి ఫోటో లకి కూడా ఇంత పాపులారిటీ రాలేదు. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగి, పూవై, కాయై, మహా వృక్షం గా ఎదగ బోతున్న నా ప్రొఫైల్ ని మొదట్లోనే తుంచేస్తావా?" బాధగా మూలిగింది మేగీ.
"మేగీ ప్లీజ్ నీ మెగా సీరియల్ ఆపేయ్" కాళ్ళు పట్టుకోవడమే తరువాయి అన్నట్లున్నాడు అంజి.
"ఎందుకు ఆపాలి? చేసిందంతా నువ్వుచేసి, ఈ పోస్ట్ విషయం లో నన్ను ఫోర్స్ చేయడం నువ్వే ఆపెయ్. " తగ్గేదేలే అనే టైపులో అంది మేగీ.
ఇదింక తేలేలా లేదని అర్ధమౌతోంది సుందరి, సుబ్బూలకి.
"సుందూ ఇప్పుడు ఏమిటి నా పొజిషన్" జాలిగా అడిగాడు సుబ్బూ.
ఏముంది, ఇక ముందు నీ జీవితం హింస, సెంటిమెంటు సమ పాళ్ళలో కలబోసిన థ్రిల్లర్ లా ఉండబోతోంది. కఠినం గా అంది సుందూ.
చచ్చాం, ఇప్పటికే ఎన్నో చిత్ర విచిత్రాలు చూపించిన సుందరి ఇక ముందు నరకం చూపించబోతోందా? మనసులో అనాలనుకుని, పైకే భయపడుతూ అనేశాడు సుబ్బూ.
కరెక్ట్ అంటూ వికటాట్టహాసం చేసింది సుందరి.
పాపం సుబ్బూ.

30, జూన్ 2020, మంగళవారం

ఆనాటి కథలు మన డిడి లో


ఆ మధ్య డిడి వాళ్ళు రామాయణం, మహభారతం పునః ప్రసారం చేస్తే ఎంతో సంబరంగా చూసారు చాలా మంది.
అప్పుడు మన తెలుగు డిడి వాళ్లు కూడా అప్పటి కథలు గట్రా వెయ్యొచ్చు కదా అనుకున్నా. 
ఈమధ్య యూట్యూబ్ లో కాశీ మజిలీ కథలు వింటుంటే (అజగవ ఛానెల్), డిడి యాదగిరి వాళ్ళు పెట్టిన పాత కథలు కనపడ్డాయి. 
కందుకూరి వారి రాజశేఖర చరిత్రము, విశ్వనాథ వారి వేయి పడగలు, ముని మాణిక్యం వారి కాంతం కథలు, కాటమరాజు కథలు, ధర్మవరపు గారి ఆనందోబ్రహ్మ, భరాగో వారి కథలు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలూ,మర్యాద రామన్న  అన్నీ కనిపించాయి.
ఈ తరం వారికి చాలా స్లో గా అనిపించినా, అప్పట్లో ఇవన్నీ చూసి ఆనందించిన వారికి బాగుంటాయని నా నమ్మకం. 
నా మటుకు నాకు చిన్నప్పుడు ఆదివారం నాడు ఆనందోబ్రహ్మ చూసి బాగా నవ్వుకున్న విషయాలన్నీ గుర్తుకొచ్చాయి.

మీలో ఎవరికైనా ఇంట్రస్టు ఉంటే చూడండి మరి.  కొన్ని లంకెలు క్రింద ఇచ్చాను ..చూసి ఆనందించండి













22, మే 2019, బుధవారం

మహానుభావుడు

నెల రోజుల నాడు కాఫీ షాప్ లో చూశాను అతణ్ణి. చూసినప్పుడే అనుకున్నా పెద్ద సైకో అయి ఉంటాడని.
ఆ రోజు ఎప్పట్లానే తల వంచుకుని ఫోన్ చూసుకుంటూ కాఫీ షాప్ కొచ్చాను.
ఇది డిజిటల్ కాఫీ షాప్, అంటే కస్టమర్ మాట్లాడాల్సిన పనే లేకుండా, యాప్ లో ఆర్డర్ చేసి, పే చేస్తే, ఒక రోబో  టేబుల్ దగ్గర కాఫీ సర్వ్ చేస్తుంది.
అంతా నిశ్శబ్దం, ఒంటరి గాళ్ళైనా, జంటలైనా, గుంపులైనా, తల వంచుకుని, ఎవరి ఫోన్ లతో వాళ్ళు బిజీ గా వుంటూ కాఫీ ఎంజాయ్ చేస్తుంటారు.

ఇదీ ఒక ధ్యానం లాంటిదే.

ఆ మధ్య, ఇలానే ఇదే కాఫీ షాప్ లో ఉన్నప్పుడు, పాత ఫ్రెండొకడు టచ్ లో కొచ్చాడు.
ఈ షాప్ లోనే ఉన్నానంటూ లొకేషన్ కూడా పంపించాడు.వాట్సాప్ లో హాయ్ అంటూ ఈమోజీ పంపి, లేటెస్టు పిక్ పంపించా.
వాడు కూడా వాడి లేటెస్ట్ పిక్ పంపాడు. చెప్పొద్దూ, చాలా హేపీగా ఫీలయ్యా. ఈ వాట్సాప్ పుణ్యమా అని, మళ్ళీ  వాడి  ని చూసే భాగ్యం దక్కింది.
ఈ వాట్సాపే లేకపోతే, తల ఎత్తి, వాడిని చూసి, వాడి దగ్గర కెళ్ళి మాట్లాడాల్సొచ్చేది. అదంతా ఓల్డ్ ఫేషన్.

ఇంతకీ ఆ సైకో సంగతి చెప్పాలి కదూ.

తపోభూమి ని తలపించే ఈ కాఫీ షాప్ లో ఒక రోజు ఒక పే...ద్ద నవ్వు వినిపించింది. సాధారణం గా అయితే, నాతో కాఫీ తాగడానికొచ్చే స్నేహితులు కూడా, ఏదైనా జోక్ చెప్పాల్సి వస్తే వాట్సాప్ లో పంపిస్తారు. బాగా నవ్వొస్తే వెంటనే నేను కూడా నాలుగు లోల్ ఈమోజీలో , ఆర్వో్ ఎఫెల్ ఈమోజీ లో 🤣🤣 పంపిస్తా. ఎంత కల్చర్డ్ గా వుంటుందీ ఈ రియాక్షన్. అంతే గానీ అలా పడీ పడీ నవ్వడమేమిటి, నాన్సెన్స్.

అతనలా నవ్విన వెంటనే, అక్కడున్న అందరూ అదిరిపడ్డారు. కొందరైతే టెర్రరిస్టు ఎటాకనుకుని ప్రాణభయంతో కంగారుగా ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో స్టేటస్ లు కూడా పెట్టేసారు.

వాళ్ళకొచ్చిన కామెంట్లూ, లైకులూ భయం భయంగా చూసుకుంటూ ఉండిపోయారు.
నాకు చుట్టూ ఉన్న సమాజం ముఖ్యం  కాబట్టి నేను మొదటి సారి తల ఎత్తి చూసా అతగాడిని.

ఏ గ్రహం నుంచి ఊడిపడ్డాడో మహానుభావుడు, చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ కూడా లేదు పైగా పుస్తకమొకటి. ఒకప్పుడు చదివేవారట కాగితాలతో చేసిన పుస్తకాలు. ఇప్పుడంతా డిజిటలే. ఎంతకీ సైరన్ కూతలూ అవీ వినపడకపోవడంతో ప్రమాదమేమీ లేదని తెలుసుకుని కొంతమంది అతడితో సెల్ఫీ లు కూడా దిగుతున్నారు. ఈ ఏలియను తో ఫొటో దిగాలనిపించి నేనూ దగరకెళ్ళాను. నన్ను చూసి చిన్నగా నవ్వాడు కూడా. నేను కూడా అతడిని చూసి లోల్ అన్నాను. అర్ధం కాలేదనుకుంటా గురుడికి. నేను నవ్వుకి బదులు ఈమోజీ లాంగ్వేజీ వాడబట్టి చాలా కాలమైంది.

సరిగ్గా అప్పుడే గమనించాను అతడి శరీర నిర్మాణం కూడా అందరిలా లేదు. ఒక చేయి రెండో చేతి కంటే పొడవుగా, పొడుగ్గా ఉన్న  చేతికి బొటన వేలు కూడా మిగతా వేళ్ళంత పొడవుగా,సెల్ఫీ లు తీసుకోడానికి వీలుగా ఉంది. అంతేకాదు అతని మెడ కూడా ఒక వైపుకి ఒంగి పోయి ఉంది.

ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేరు ఈ విషయాన్ని. నాకు మాత్రం మొదట ఆశ్చర్యం, తర్వాత భయం వేశాయి. చెప్పొద్దూ, వెంటనే వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ చేసా. ఫీలింగ్ కన్‌ఫ్యూస్‌డ్ అని.

అతనే అన్నాడు "నన్ను చూసి ఎందుకు అందరూ భయపడుతున్నారు?"

"ఇంత పెద్దగా నవ్వడం ఎప్పుడూ ఎవ్వరూ ఈ మధ్య కాలం లో విని వుండరు అందుకే"  అన్నాను.

"అవునా!" ఆశ్చర్యంగా అన్నాడు.

ఇంతలో అటుగా ఓ టీనేజీ కుర్రాడొచ్చాడు. "నీ చేతిలో డివైస్ ఏంటి? దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు? వై దేర్ అర్ నో బటన్స్ ఎట్ ఆల్ ?" అతి కష్టంమీద మాట్లాడుతున్నట్లడిగాడు పుస్తకాన్ని చూపిస్తూ.

"దీన్ని పుస్తకం అంటారు" అన్నాడు ఏలియన్ ఆ కుర్రాడి వైపు పుస్తకం జరుపుతూ.

"నీ చేతిలో ఉన్నది పుస్తకమని నా లాంటి సీనియర్ సిటిజనుకి తప్ప ఈ జనరేషన్ వాళ్లకి తెలియదు" అన్నానేను.

"డస్ ఇట్ నీడ్ పాస్వర్డ్?" ఉత్సాహంగా అడిగాడా కుర్రాడు.

"నో"

పుస్తకం చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ అన్నాడా కుర్రాడు "బాటరీస్ ఎక్కడున్నాయి? ఈజిట్ సోలార్ పవర్డ్?"

"నో , దీనికి బాటరీస్ , పవర్ ఏమీ అక్కర్లేదు . ఇలా పేజీలు తిప్పుతూ చదవాలి " చూపించాడు.

"వావ్, ఈజ్  దిస్ రియల్ ? అనుకుంటూ తన స్మార్ట్ ఫోన్ లో ఫోటోలు తీసుకుని, ఆశ్చర్యం కంటిన్యూ చేసుకుంటూ వెళ్లి పోయాడు.

"ఏంటీ అతను పుస్తకాన్ని వింతగా చూస్తున్నాడు?" అన్నాడతడు.
"ఓ అదా! ఇప్పుడు స్కూల్స్ లో అంతా స్మార్ట్ డివైస్ లు వాడుతున్నారు, పరీక్షలు కూడా కంప్యూటర్ లోనే. అందుకే ఇప్పటి పిల్లల్లో చాలామందికి పుస్తకాలు తెలియవు." అన్నాన్నేను.
చిన్నగా నవ్వుకున్నాడతను.

ఇంతకూ నువ్వెవరు, చిన్నవాడి లానే ఉన్నావు కానీ స్మార్ట్ ఫోన్ లేదు. ఏలియన్ వా ?" అడిగాను .
"నేను భవిష్యత్తు లోంచి వచ్చాను"
"భవిష్యత్తు లోంచా ?" భయం గా అడిగాను .
"అవును అందుకే నా చెయ్యి ఇలా వుంది " అన్నాడు చెయ్యి చూపుతూ .
"ఫ్యూచర్ లో మనిషికి తినడానికి తిండి లేదు. తాగడానికి  నీళ్లు లేవు. విటమిన్లూ మినరల్సూ, లాగా అంతా ట్యాబ్లేట్లే . మాట్లాడడానికి కూడా నోరు వాడక పోవడం వల్ల , నోరు సైజ్ కూడా తగ్గిపోయింది"
అప్పుడు చూసా, అతని నోరు కూడా చాలా చిన్నగా ఉంది.
"ఫిజికల్ , వర్చువల్ స్క్రీన్  లు చూసి చూసి కళ్ళు కూడా చిన్నగా అయిపోయాయి.  పెద్దగా కష్ట పడే పని లేకపోవడం వల్ల , శరీరం కూడా గుండ్రం గా అయిపోయింది " అన్నాడు బాధగా.
"మీరు ఫ్యామిలీ తో కూడా మాట్లాడుకోరా?" అన్నాను
"లేదు, మాకు ఫ్యామిలీ కాన్సెప్టు లేదు. టెక్నాలజీ కి బాగా అలవాటు పడిపోయి, మాకు మనిషి లక్షణాలు పోయాయి. ఫెర్టిలిటీ కూడా లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరిగిపోయింది. పిల్లలు కూడా క్లోనింగ్ ద్వారానే పుడతారు.  జనాభా ని బట్టి ప్రభుత్వాలే ఇంతమందిని పుట్టించాలి అని శాంక్షన్ చేస్తారు."
"మరిప్పుడు ఇక్కడి కెందుకొచ్చినట్లు ?" అన్నాను.
"మా టైం లో మేము మనుషులుగా ఎందుకు పుట్టామో అర్ధం కాక చాలా మధన పడి పోయాం. మేమెందుకిలా అయిపోయాం అని రీసెర్చ్ చేసాం . "

"అయితే, తెలిసిందా?"
"ఆ రీసెర్చ్ లో మేమో టైం మెషీన్ కనిపెట్టి , గతం లోకి వెళ్లి చూసాం"
"ఏం అర్ధమయ్యింది?"
"మీ స్వార్ధం వల్లే మేమిలా మారామని తెలిసింది. మీరు చెట్లు నరికేశారు, నీళ్లు, ఆహారం లేకుండా చేశారు."
"మేమా! నాన్సెన్స్ .! ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాం."
"నిజమే , కానీ ఆ టెక్నాలజీ ని మానవీయ కోణంలో అభివృద్ధిచెయ్యలేదు. అదే టెక్నాలజీ కాలక్రమేణా మనిషి తోటి మనిషితో కూడా మాట్లాడలేనంత డెవలప్ అయిపోయింది " అన్నాడు నిష్టూరం గా.
"నువ్వు పట్టుకున్న పుస్తకం కూడా మేము చెట్లు నరికి చేసిందే" అన్నాను నిజం ఒప్పుకుంటూ.
"ఇప్పుడు మాకు నరకడానికి చెట్లు కూడా లేవు, ఆ మాటకొస్తే పచ్చదనమే లేదు"
"ఇప్పుడేం చేద్దామని ?"
"ఏముంది?, భూమి మీద ఎక్కడైనా పచ్చదనం ఉంటే వెతికి , మొక్కలు చెట్లు పెంచాలని ఈ మధ్యే నిర్ణయించాం. టెక్నాలజీ సాయంతో మనుషులు తోటి మనుషులతో మాట్లాడే విధానం కనిపెడుతున్నాం. మనిషి గా ఉండడం వల్ల , మనిషి లో ఉండాల్సిన మానవత్వం , హృదయ మార్దవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెవలప్ చేస్తున్నాం “
"అసలు మనిషంటే ఏంటో మీకెలా తెలుసు?" ఎంక్వైరీ చేశాను.
"మా తవ్వకాలలో కొన్ని పుస్తకాలూ,కొంత డేటా దొరికాయి. వాటిని అనలైజ్ చేసి హ్యూమన్ బిహేవియర్  అల్గారిథంస్ తయారు చేసాం. నా లాంటి కొంత మంది గతం లోకి వచ్చి మనుషులనీ, వారి పోకడలనీ గమనించాం. ఇవన్నీ ఆ అల్గారిథంస్ ని ఇంకా మెరుగు పరచడానికి వాడతాం.”
"నీ ప్రయాణం లో నీకేం తెలిసింది?"
"గతం లో మనుషులు డబ్బు కన్నా సాటి మనిషికి , స్వార్ధం కన్నా పరోపకారానికి ఎక్కువ విలువ ఇచ్చారనీ తెలుసుకున్నాను. సంఘ జీవనం లో క్రమేణా కులాలూ, మతాలూ తామే సృష్టించుకుని , తమ చుట్టూ తామే అనేక గిరులు గీసుకుని సాటి మనిషిని దూరం చేసుకున్నారు. టెక్నాలజీ వాడకం పెరిగి, తమకు తామే దూరం ఐపోయారు."
"అంటే మనిషి ని మళ్ళీ మనిషి లా తయారు చేయబోతున్నారన్నమాట "
"అవును, ఆ టెస్ట్ లో భాగం గా నేను ఇక్కడికొచ్చాను.  వచ్చిన పనైపోయింది , ఇక వెళ్తున్నా " అని మాయమై పోయాడు .

మనసంతా విచిత్రం గా వుంది. అతనిప్పుడు ఏలియన్ లానో, సైకో లానో అనిపించట్లేదు , నాలో ఆలోచనల సునామీ ని రేపి, నేనూ మనిషినే అని గుర్తు చేసిన మహానుభావుడు లా అనిపిస్తున్నాడు . 

8, మే 2019, బుధవారం

మంచోళ్ళు


"హిట్లర్ మంచి పరిపాలకుడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల వలె పాలించెను."
"ఒరేయ్! ఏమిటా పిచ్చి కూతలు, హిట్లర్ ఎలాంటివాడో ప్రపంచమంతా తెలుసు."
"కానీ నీకే తెలీదు ఆత్రేయ గారేం చెప్పారో"
"నాకేం చెప్పలేదు"
"నాకు చెప్పారు లే పోయినోళ్ళంతా మంచోళ్ళు  అని"
"అయితే మాత్రం హిట్లర్ ని కూడా పొగడాలా"
"ఖచ్చితం గా, ఎలాంటి నాయకులైనా, ఎంత పెద్ద కేసులున్నవారైనా, వాళ్ళు పోయాకా పొగడి తీరాలి."
"వీల్లేదు, ఉన్నదున్నట్లు గా చెప్పాల్సిందే."
"నువ్వు సంఘీ వా?"
"కాదు సామాన్యుణ్ణి ."

--Modi comments on Rajiv

6, మే 2019, సోమవారం

నయా నేషనలిజం



"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా"
"నువ్వు ఈ దేశం లో పుట్టి పెరిగావా?"
"అవును"
"నువ్వు ఈ దేశ పౌరుడివేనా?"
"కాదు"
"అయితే నీకీ పాట పాడే అర్హత లేదు"
"అరె నేను ఇక్కడే ఉంటున్నా, పని చేస్తున్నా, పన్నులూ కడుతున్నా"
"ఐనా సరే, నీకా అర్హత లేదు"
"మరి, షెహజాదా, రాజ మాత .."
"ఏం పర్లేదు, మాకు విదేశీ పాలన అలవాటే, నువ్వు మాత్రం ఈ దేశాన్ని ప్రేమించకూడదు"
"నువ్వు ఏ పార్టీ వాడివో నాకర్ధం అయ్యింది"
"నువ్వు ఏ పార్టీ వాడివో నాకూ అర్ధం అయ్యింది"
"నాకు ఓటు హక్కు కూడా లేదు, ఇంకా పార్టీ ఏమిటి? నేను విపత్తు సమయాల్లో, ప్రజల కోసం చాలా విరాళాలిచ్చాను"
"అవన్నీ నువ్వు నా దేశం లో పన్ను లు ఎగ్గొట్టానికి చేసిన జిమ్మిక్కులు"
"నువ్వు నిజం గా దేశభక్తుడివేనా?"
"అది నీకనవసరం, కానీ నువ్వు మాత్రం  ఈ దేశాన్ని ప్రేమించడానికి వీల్లేదు"

---- ఈ మధ్య ఓ నటుడి పౌరసత్వం గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న రచ్చ ప్రభావం

26, ఏప్రిల్ 2018, గురువారం

నయా వైకుంఠం


తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వార్షిక సంచిక లో నా కథ  ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు.

అల వైకుంఠ పురంబు లో, నగరి లో, అని పోతన గారు చెప్పినట్లే, భక్త వల్లభుడా శ్రీహరి శేష పాన్పు పై పరుండి, ఏదో ఆలోచిస్తూ ఉండగా, త్రిలోక సంచారియైన నారదుడు శ్రీవారి దర్శనార్థం వచ్చాడు.
"కలహ భోజనా, ఏమి విశేషాలు?"
"హరి హరీ! మీరూ ఆమాటే అంటే ఎలా యదునందనా? నేను ఏమి చేసినా లోక కళ్యాణార్ధమే యని తమరెరగని సత్యమా."
"ఇంతకీ విషయం చెప్పమనండి ప్రభూ" అంటున్న అమ్మవారి మాట విని, నారదుడు
"నరలోక విచిత్రాలు వివరిద్దామనొచ్చాను ప్రభూ."
"మరల వియోగం తప్పదు కాబోలు" అనుకున్నది అమ్మ వారు, పద్మావతీ వృత్తాంతం తలచుకొని.
"అక్కడచూసిన వైకుంఠ వైభోగం తమరు చూసి తీరవలసింద"న్నాడు నారదుడు.
"మర్త్యలోకమున మరొక వైకుంఠ మా!" ఆశ్చర్యం ప్రకటించాడు అరచేయి చూసుకుంటూ కపట నాటక సూత్ర ధారి.
"అలనాడు త్రేతాయుగంలో తమరు వానరులకిచ్చిన వర ప్రభావమున, తామరతంపరగా పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు, ఐదేళ్ల కొకసారి చూపే అరచేతి లో వైకుంఠం కాదు ప్రభూ నేను చూసినది" అన్నాడు అయ్యవారిని గమనించి.
"మరి?"
"ఒక వైకుంఠం కాదు ప్రభూ, కోటాను కోట్ల వైకుంఠాలు. మానవుల అరచేత మొలిచిన అద్దం కథ. "
"మొదట వైకుంఠ మన్నావు, ఇప్పుడు అద్దం అంటున్నావు. తికమక పెట్టక వివరం తెలుపుము నారదా!" అదిలించారు శ్రీవారు.
"అక్కడే ఉంది కిటుకు ప్రభూ. అది మామూలు అద్దం కాదు. అది సమస్త లోక విషయ విశేషాలు చూపగలదు. స్వర్గమూ నరకమూ, మంచీ చెడూ, దేవ దానవ రీతులూ దాని యందు గలవు. మనిషి సృష్టించిన పదిహేనవ లోకమూ దాని యందే కలదు."
"పదిహేనవ లోకమా?"
"అవును జనార్దనా, దానిని జాల లోకమందురు. దైత్యులందరునూ అచ్చట తిష్ఠ వేసుకునుండి, మానవులనిక్కట్ల పాల్జేయు చుంటిరి. జయ విజయులచ్చటనూ ద్వారపాలకులు గా వర్ధిల్లు చున్నారు. వారినచ్చట ఫేస్బుక్ ,వాట్సాప్ లందురు. వీరు మానవ జాతికి తెచ్చు అనర్ధములు చెప్పనలవి కాదు.
గరుత్మంతుని కంటే బలమైన పక్షి యొకటి దాపురించినది. అది సత్యాసత్య ప్రమేయములు లేక అనేకానేక వార్త లను ప్రచారము గావించుచూ మనుషులను పట్టి పీడించు చున్నది.దానిని ట్విట్టరందురు. వీరే గాక నాళికా సురుడు 'యూట్యూబ్' అను పేర, చిత్రపటాసురుడు 'ఇన్స్టాగ్రాం' అను పేర దిన దినాభి వృద్ధి చెందుతున్నారు.వీరి తో పాటు అనేకానేక పేర్లతో పెక్కురు రక్కసులచట పేట్రేగిపోవుచుంటిరి.
కొందరు లక్ష లైకుల నోము, కోటి ఫాలోయర్ల వ్రతము యను విచిత్ర పూజా విధానములను కనిపెట్టి, లోకులను ప్రలోభ పెట్టుచూ పబ్బము గడుపుకొనుచున్నారు.
క్రొంగొత్త ప్రాతః పఠనీయ మంత్రములనూ కనిపెట్టుచున్నారు. నేడట్టి  ప్రార్ధనా మంత్రమొకటి నా చెవిన పడ్డది.
కరాగ్రే వసతే వాట్సాప్
కర మధ్యే ఫేస్బుక్
కర మూలే స్థితా ట్విట్టర్
ప్రభాతే జాల దర్శనం.

మనుజులు వీరి ప్రభావమునకు లోనై, దుర్బలురై, మనోవిచారములతో, దుఃఖములతో బాధ పడుచున్నారు. వీరికి విముక్తి లేదా? వారి ఇక్కట్లను తొలగించుటకు మీరే ఏదైనా మార్గము చెప్పండి ప్రభూ.

అది విన్న మాధవుడు, "నారదా! పెరుగుట విరుగుట కొరకే యను లోకోక్తి నీకు తెలియనిది కాదు. జాలాసుర సృష్టి శివాజ్ఞ లేకుండా జరిగినది కాదు, ఆతని వలన పెక్కు ప్రయోజనములుండుటా కల్ల కాదు. మానవులొట్టి అమాయకులు. వారికెయ్యది ఎటుల ఉపయోగించుకోవలెనో తెలియదు.
జాలాసుర భంజనమునకై పరమశివుని అంశతో వైరస్ అను శక్తి ప్రజ్వరిల్లుచూ ఆ దైత్యులను ఇప్పటికే హడలెత్తించు చున్నది. ఇది కాక హ్యాకింగను మరొక శక్తి కూడా శాయ శక్తులా కృషి చేయు చున్నది. అసురుల పాపము పండువేళ, వీరి శ్రమ కొకనాడు విజయము లభించుట తధ్యము. అంత వరకూ మనుజులు, నిర్జాలీకరణ వ్రతము చేయ వచ్చును”

"నిర్జాలీకరణ వ్రతమ నగా యేమి? అది యెట్లు చేయవలెను?"

నారదా, దుర్లభమగు ఈ వ్రతము మనుజులందరూ చేయ తగినది. అన్ని మతముల వారూ, కులముల వారూ, అన్ని జాతుల వారూ, అన్ని వయసుల వారూ చేయవచ్చును.ఆది వారము నాడు గాని, మరే రోజైననూ గానీ, ఈ వ్రతము చేయ వచ్చును. ప్రాతః, సంధ్యాదులలో ,యే వేళనైననూ చేయ వచ్చును. దీని వలన మానవులకు వారు కోల్పోయిన నిజ జీవితము లభ్యమగును. ఎంచుకున్న సమయము నందు, వీరు నిశ్చింతగా జాల ప్రసారము చేయు చర వాణులనూ, ఇతర పరికరములనూ ఆపి వేయ వలయును. అట్టి సమయమును వారు పిల్లలతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడప వలయును. ఇది వారమునకెన్ని మార్లయిననూ చేయవచ్చును. ఇది సమస్త లోకములకూ ఆనంద దాయకము. 
*********శుభం ***********


24, జనవరి 2018, బుధవారం

శ్రీశ్రీ ఇజం


క్రింది వీడియోలో చంద్రబోసు గారు తన పూర్వ కవుల గురించి అపూర్వమైన మాటలు చెప్పేరు.








వాటిలో నాకు బాగా నచ్చినవి శ్రీ శ్రీ గారి గురించి చెప్పిన మాటలు. 
"కవితయను కన్య కి, పోరాట పురుషునికి పెండ్లి చేసిన పురోహితుడు శ్రీ శ్రీ”. 

అప్పటికే విప్లవ సాహిత్యం ఉన్నా (అరసం, విరసం ఉన్నాయేమో తెలియదు), దాన్ని లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ లో కి లాక్కొచ్చి, ఉరుకులూ పరుగులూ పెట్టించాడు. ఉర్రూతలూగించాడు. చాలా మందిని విప్లవ సాహిత్యం చదవడానికి, రాయడానికి ప్రేరేపించాడు. యోగ్యతా పత్రం లో చెలం చెప్పినట్టు, "రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, ఝంఝానిల షడ్జధ్వానం" గుండెల్లో మోగించాడు.

పాతికేళ్ల నాడు, చాలా మంది దిగువ మధ్యతరగతి టీనేజర్ల లానే నేనూ ఆయన భావాలకి దగ్గరయ్యాను.
శ్రీ శ్రీ పడికట్టు పదాలు ఎంత గొప్పవంటే, నాలాంటి అర్భకులు కూడా,ఇప్పుడు, ఈ కాలం లోఆ పదాలను వాడినా, అచ్చు వేసేంత గొప్పవి. 
గతేడాది తెలుగు వెలుగు లో నా కవిత కేవలం ఆ పదాల వల్లే అచ్చైందనిపిస్తుంది.


శ్రీ శ్రీ  ని సరిగ్గా అర్ధం చేసుకున్నాడో లేదో కూడా తెలియకుండానే, కేవలం శ్రీ శ్రీ  రచనా శైలి తో గుడ్డి ప్రేమ లో పడిన అప్పటి టీనేజీ కుర్రాడి రచన ఇది. చదివాక నవ్వొస్తే మీ తప్పేం లేదు, చాలా వాటికి క్షమించాలి నన్ను.



మరో ప్రపంచపు జ్వాలల నుంచీ,
రుద్ర విపంచుల ధ్వానం నుంచీ,
రుధిరాక్షరాల సత్యం నుంచీ,
వేదం నుంచీ - స్వేదం నుంచీ,
ఖేదం నుంచీ - మోదం నుంచీ,
నాదం నుంచీ- గానం నుంచీ,
రాగం నుంచీ,
జాలు వారాలి కవనం,
కళ్ళు తెరవాలి జనం,
కుళ్ళి పోవాలి కులం,
పారిపోవాలి మతం,
అంతమవ్వాలి అన్యాయం,
వెల్లువెత్తాలి ప్రభంజనం,
భారతి కావాలి నందనవనం.


వీడియో సేకరణ : వాట్సాప్

14, ఫిబ్రవరి 2017, మంగళవారం

హేవ్ ఎ డేట్

"జనానికి బొత్తిగా దేశభక్తి లేకుండా పోతోంది"చిరాగ్గా అన్నాడు గిరి.
"చివరికి మోదీ, మేంగోమేన్ కూడా ఇలా చేస్తారనుకోలేదు."
వాడేం మాట్లాడినా ఏమైంది అని మనం అడగక్కరలేదు. వాడంతే ఇంటర్నెట్/సోషల్ మీడియా  లో వచ్చిన ప్రతీదీ నిజమని నమ్మే అమాయకుడు. రాజకీయాల పై మాట్లాడ్డం మొదలుపెడితే, ఎవరిని తిడుతున్నాడో, ఎవరిని సపోర్టు చేస్తున్నాడో తెలుసుకోవడానికి వారం పడుతుంది.
"కమాన్ రా, ఇవాళ వేలన్ టైన్స్ డే, కీప్ కాం ఎండ్ హేవ్ ఎ డేట్" అన్నా.
"నువ్వు కూడానా? ద్రోహీ".   
"బ్రూటస్ యూ టూ" అన్నప్పుడు సీజర్ కూడా ఇంత ఎక్స్ప్రెషను ఇచ్చి ఉండడు. ఇక వివరం కనుక్కోక పోతే పాత సినిమాలో గుమ్మడి లాగ గుండె పట్టుకుని పడిపోయేలా వున్నాడు.
"ఆవేశం అన్ని విధాలా అనర్ధం రావ్ గోపాల్రావ్" అన్నాను కొంచం కూల్ చేద్దామని.
అంతే, టివి 9 చూసిన  కేసీయార్ లా ఫైర్ ఐపోయాడు.
"మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీసిన రోజు రా ఇది.  హేవ్ ఎ డేట్ అని ఎలా అనగలుగు తున్నావ్ రా" అంటూ ఫోన్ లో వాట్సాప్ మెసేజి చూపించాడు.



"నీ బొంద రా నీ బొంద. వాళ్ళని ఉరి తీసిన రోజు మార్చి ఇరవై మూడు. నీ దేశ భక్తి ఆ రోజు కూడా చూపించు."
"నిజాలు తెలుసు కోకుండా మాట్లాడకు, ఇదే వార్త ఫేస్బుక్ లో కూడా వచ్చింది తెలుసా?" ఒక్కోసారి వాడు కేజ్రీవాల్ లా బిహేవ్ చేస్తాడు.
"వాట్సాప్ లో, ఫేస్బుక్ లో వస్తే నిజమై పోతుందా? ముందు ఈ రెండూ వాడడం తగ్గించి, అప్పుడప్పుడూ బుర్ర కూడా వాడు." నేనెప్పుడూ వాడికి చెప్పాలనుకున్న మాట కూడా చెప్పేశా.
వీడికి కూడా ప్రూఫ్ కావాలని నాకు తెలుసు. లేకపోతే ఇప్పుడు ఆర్టీఐ వేస్తానంటాడు. అందుకే ఇండియన్ లా జర్నల్ చూపించా.
జ్యోతి పేపర్ చూసిన చంద్ర బాబు లా చల్ల బడ్డాడు.
"ఐతే నువ్వన్నది చేసెయ్యమంటావా?"
"ఏంటది"
"అదే హేవ్ ఎ డేట్"
"నీకు ఆ డేట్ అంత సీన్ లేదని నాకు తెలుసు గానీ, నేను చెప్పింది ఈ డేట్ గురించి" అంటూ చేతి లో ఒక ఖర్జూరం పెట్టి.
"తిను మెదడు బాగ పని చేస్తుందట" అన్నా.
"నీకెలా తెలుసు?"బుర్ర వాడడం మొదలు పెట్టినట్టున్నాడు.
వాట్సాప్ లో డేట్స్ మీద వచ్చిన మెసేజి చూపించా. ఒప్పుకోక చస్తాడా?

13, నవంబర్ 2016, ఆదివారం

మాయా'జాలం'

లోకమే కానరాకుంది మనిషికి,
అరచేతిలో అద్దం మొలిచాక.

దూరమైపోయాడు  సాటి మనిషికి,
నెట్టింట జాలం పురుడు పోసుకున్నాక.

31, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీరంగనీతులు

మట్టి వినాయకుల్నే వాడండి!!!
దీపావళికి టపాసులు కాల్చకండి!!!
ఇది చాలా మంది ప్రకృతి ప్రేమికులు/ సెలబ్రిటీ లు చెబుతున్నమాట.

"ప్రకృతేం నీ అబ్బ సొత్తుకాదు
ఒకనెల నీటినీ,
మరోనెల గాలినీ
కలుషితం చెయ్యడానికి."
ఇలాంటివి మరి కొంతమంది మేధావులు చెబుతున్నది.

నిజమే కావచ్చు, వారి ఆర్తి అర్ధం అవుతోంది.

కానీ వీళ్ళంతా ఏడాది పొడుగునా, ప్రకృతిని ఇంతగానే ప్రేమిస్తుంటారా? అంటే అనుమానమే.
రోజూ కాలినడకతోనో, సైకిల్ మీద తిరుగుతూనో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతూనో కాలుష్యాన్ని తగ్గిస్తూంటారా అంటే అనుమానమే.
"మేం కార్లల్లో తిరుగుతూ లెక్చర్లు దంచుతాం, 
కానీ సామాన్యుడా నువ్వుమాత్రం ఇంత అమానుషంగా పండుగలు జరుపుకుంటావా?" అని అడుగుతున్నట్లనిపిస్తుంది నాకయితే.

సెలబ్రిటీలూ, మేధావులూ, మీరు చెప్పినట్లే మట్టి వినాయకుల్ని వాడుతున్నాం, టపాసులూ మానేస్తాం, మీరు కార్ల వాడకం మానేసి, కాలుష్యం తగ్గించండి.

శ్రీరంగనీతులు ఎదుటి వారికే అంటారా?!!!

20, ఏప్రిల్ 2016, బుధవారం

రాజకీయ బేతాళం

"మేంగో మేన్ సెంటర్ కి థ్యాంక్స్ చెప్పాడు తెలుసా" వస్తూనే అన్నాడు గిరి.
వాడికి రాజకీయాల పిచ్చి, ముఖ్యం గా ప్రముఖుల ఏకపక్ష ట్వీట్లు చూసి, అదే రాజకీయ సమాచారం అనుకునే వాళ్ళలో వీడు ఒకడు.
"ఇంతకీ ఈ మేంగో మేన్ ఎవరు? సెంటర్ కి థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు?" 
"ఇది కూడా తెలీదూ? ఆమాద్మీ ని ఆంగ్లీకరిస్తే మేంగో మేన్"
అప్పుడర్ధమయ్యింది వీడు దిల్లీ సిఎం నీళ్ళ ట్వీటు గురించి మాట్లాడుతున్నాడని. ఇది జరిగి చాలా రోజులయ్యిందిగా, ఇప్పుడెందుకా గోల, విసుగ్గా అన్నా. 
"కానీ నేనిప్పుడే చూశా. కాశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ ఇచ్చేవరకూ నేను ఇంటర్నెట్ వాడకుండా నిరసన వ్యక్తం చేశా" గొప్పగా చెప్పాడు వాడు.
వీడికి ఈ కళ కూడా ఉందా? ఆశ్చర్య పోవడడం నా వంతైంది.
"అయితే ఏంటిట?" అన్నా
"ఎప్పుడూ సెంటర్ ని తిట్టే నోరు ఒక్క సారే థ్యాంక్స్ చెప్తే విశేషం గాక మరేమిటీ?" అల్ప సంతోషి వీడు.
"అన్నీ భూతద్దం లో చూడకు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ, మిత్రులూ ఉండరు. నిన్న నితీష్-లాలూ లకి మద్దతిచ్చిన వాడు, రేపు మోదీ కి మద్దతివ్వకూడదని రూలేమీ లేదు. అన్నీ ఓ తాను ముక్కలే, ఈ విషయం తెలీక మనం సోషల్ మీడియా లో కొట్టుకు చస్తుంటాం."
మన్మోహన్ సింగు గట్టిగా మాట్లాడినట్టు ఉలిక్కి పడ్డాడు.
"నువ్వన్నది ససేమిరా జరగని పని. రాజకీయాల్లో నాకున్న నాలెడ్జి ని బట్టి చెబుతున్నా" అన్నాడు.
"అంత నాలెడ్జి ఉంటే నేనడిగే వాటికి సమాధానం చెప్పగలవా?" సవాల్ చేసాన్నేను.
"ఆ తప్పకుండా."
బేతాళ ప్రశ్నలు:
1) తన జీతాన్ని తానే అమాంతం పెంచేసుకున్న దిల్లీ సిఎం, సామాన్యుడి జీవన ప్రమాణాన్ని అమాంతం ఎందుకు పెంచలేదు?
2) విదేశాల్లో విపరీతం గా మాట్లాడే పిఎం స్వదేశం లో రోజు రోజుకీ పెరుగుతున్న సమస్యల పై ఎందుకు మాట్లాడటం లేదు?
3) ఉద్యమాల్లో నేతల కుటుంబాలు కాకుండా కేవలం విద్యార్ధులే ఎందుకు ఆత్మ హత్య చేసుకుంటారు?
4) లక్షల కోట్లున్న నాయకులు, ప్రజల కోసం సొంత డబ్బు ఒక్క పైసా కూడా ఎందుకు ఖర్చు పెట్టరు?
5) హైదరాబాదు ని ప్రపంచ పటం లో నిలిపానన్న బాబు, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు చావు దెబ్బ తిన్నాడు?
6) విదేశాల్లో చదువుకున్నాని చెప్పే రాహుల్ గాంధీ ఒక్క మీటింగు లో కూడా సరిగ్గా ఎందుకు మాట్లాడలేడు?
7) గడ్డి కుంభ కోణం లో శిక్ష పడ్డా కూడా, బీహార్ ప్రజలు లలూ పార్టీకే ఎందుకు ఓట్లేశారు?
8) యూనివర్సిటీల్లో జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యక్రమాలకి కొన్ని మీడియా వర్గాలు, పార్టీ లు ఎందుకు వత్తాసు పలుకుతున్నాయి?
9) సెంటర్ లో చక్రం తిప్పగలిగిన బాబు, ఆంధ్రా కి ప్రత్యేక హోదా ఎందుకు ఇప్పించ లేకపోతున్నాడు?
10)ప్రశ్నించడానికే పుట్టానన్న జన సేనాని, ఎందుకు చాలా విషయాల్లో మౌనంగా ఉంటున్నాడు?
సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ 3జి కనెక్షను కట్ చేస్తా అని హెచ్చరించాను.

"వీటన్నిటికీ సమాధానం నేను చెప్పగలను, విని అర్ధం చేసుకునే సత్తా నీలోఉందా?" అన్నాడు.

"సత్తా అంటే గుర్తొచ్చింది, రాజకీయ ప్రక్షాళణే ధ్యేయంగా గోదాలోకి దిగిన లోక్ సత్తా, ఎందుకు అస్త్ర సన్యాసం చేసింది?" మరో ప్రశ్న వేశా.

"నీకు నోస్ట్రడోమస్ తెలుసా? ఆయన ఆత్మ ని అడగి తెలుసుకోవాలి ఇవన్నీ. యండమూరి తులసిదళం నవల ఒకసారిద్దూ ఆత్మలతో మాట్లాడాలి". పలాయనం చిత్తగించాడు గిరి.



16, ఫిబ్రవరి 2016, మంగళవారం

కష్టం లో సంబరాలు

కష్టం వచ్చినప్పుడు మనిషి స్పందించే తీరు ఆ మనిషి వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం అంటారు.

కట్ టూ బందరు బస్టాండు:

            దాదాపు పాతికేళ్ళ క్రితం, బందరు బస్టాండులో విజయవాడ టికెట్ల క్యూ లో ఉన్నాన్నేను . జేబులో చిల్లిగవ్వ లేకపోయినా ఏ ధైర్యంతో క్యూ లో నిలబడ్డానో నాకే తెలియదు. సరిగ్గా అప్పుడొచ్చాడు అతను, "ఏంటి ఇక్కడ మా ఊళ్ళో? బెజవాడకేనా?" అని పలకరించి, తనతో పాటూ నాకూ టికెట్ తీశాడు. ఎక్కడో చూసినట్లుందే గానీ, ఎవరో గుర్తు రాలేదు చప్పున. అప్పటికే నేను అనారోగ్యం తో కాలేజీ కి దూరమై నెల పైనే అయ్యుంటుంది. దారి పొడుగునా ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఎవరో, ఏమిటొ అడిగే ధైర్యం చెయ్యలేదు నేను. ఎంతైనా టికెట్ కొన్నాడు గా మరి.

ఆ తర్వాత కాలేజీ లో మళ్ళీ కనబడ్డాడు, అప్పుడర్ధమయ్యింది, తను మా జూనియర్ అని. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి చాలా రోజులే పట్టింది నాకు. వాళ్ళ హాస్టలు కెళ్ళి ఇవ్వబోతే సున్నితం గా వారించాడు, నా అభ్యంతరాలన్నీ తేలిగ్గా కొట్టి పారేశాడు. ఆ పరిచయం అంతకన్నా ముందుకు పోలేదు ఆ రోజుల్లో.

కట్ టూ సంబరాలు:

             మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఐ.ఐ.టి ఎడ్మిషన్లలో కనిపించాడు. మా క్లాసే, మా హాస్టలే. అప్పుడే అతని గురించి మరింత తెలుసుకునే అవకాశం దొరికింది. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండేవాడు. సంబరాలు అనే ముద్దు పేరు కూడా సంపాదించాడు ఫ్రెండ్సర్కిల్లో . ఒక మనిషితో ఒక సారి మాట్లాడితే, ఎంత కాలమైనా ఆ మనిషిని పూర్తి వివరాలతో సహా గుర్తుంచుకోగలిగేవాడు. జీవితం మీద అతనికున్న దృక్పధం, కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం ఎంతో స్ఫూర్తిమంతం గా ఉండేది.

కట్ టూ ప్రెజెంట్:

        తర్వాతి కాలం లో ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడి, ఒక విదేశీ వనితని పెండ్లాడి, ఒక బిడ్డకి తండ్రయ్యాడు మా సంబరాల గంగాధర్. అంతటి ధైర్యశాలికి ఏ తండ్రికీ రాకూడని కష్టం వచ్చింది. 




గంగాధర్,రేచల్ దంపతుల గారాలపట్టి , మూడేళ్ళ సరస్వతి ప్రస్తుతం లుకేమియా తో పోరాడుతోంది. ఈ కష్టాన్ని కూడా అతను చిరునవ్వుతో నే ఎదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. .

ఇది సరస్వతి వైద్య ఖర్చుల నిమిత్తం ఏర్పాటు చేసిన "గో ఫండ్ మీ" పేజ్.
https://www.gofundme.com/24kun5uc

ఈ facebook పేజి సరస్వతి supporters కోసం
https://www.facebook.com/groups/1500390773601766/

 వదాన్యులు అందరూ ఆ దంపతుల కి బాసట గా నిలవాలని, చిన్నారి సరస్వతి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.






25, జనవరి 2016, సోమవారం

కులమే అన్నిటికీ మూలమా?

రోహిత్ మరణం తర్వాత, ఎంతో మంది, ఎన్నో కోణాలలో విశ్లేషించారు. 
ఆ దృక్కోణాలన్నీ చూస్తున్నపుడు నన్ను తొలిచిన ప్రశ్నలు, 
కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరమా?
కులమే అన్నిటికీ మూలమా?

నా అనుభవంలోకొచ్చిన కొన్ని సంఘటనలు తలచుకొని, అలోచించడం మొదలు పెడితే..

దాదాపు పాతికేళ్ళ క్రితం మాట:
పేద ఓ.సి కుర్రాడి కథ:
పదో తరగతిలో 500 పైగా మార్కులతో పాసయ్యాడు. పాలిటెక్నిక్ ఎంట్రన్సు లో వంద లోపు ర్యాంకు తెచ్చుకున్నాడు. మెకానికల్ చదవాలనుకున్నా, జనరల్ కేటగిరీ లో సీటు దొరకలేదు.
ప్రైవేటు ఫీజులు చెల్లించలేక దొరికిన బ్రాంచి లోనే, ప్రభుత్వ కళాశాల లో చేరాల్సి వచ్చింది.
అయినా బాధ పడలేదు వాడు, అదే మహా భాగ్యమనుకొన్నాడు. తమ కులం వాళ్ళకే ఉచిత వసతి, భోజనం పెట్టే (ప్రైవేటు ఛారిటీ) హాస్టల్లో వుంటూ చదువుకున్నాడు.
కాలేజీ లో తనకు రావాల్సిన మెరిట్ స్కాలర్షిప్పు కూడా, వాళ్ళే మింగేస్తే, ఏ విద్యార్ధి సంఘమూ బాసట గా నిలవలేదు. (అప్పట్లో ఇప్పుడున్నన్ని సంఘాలు లేవేమో).
అయినా సమాజం లో ఉదార స్వభావుల సహాయంతో, పీజీ దాకా చదివాడు. ఈ ప్రభుత్వానికి తన లాంటి మెరిట్ విద్యార్ధులు అక్కరలేదేమో అనుకున్నాడు. ఫారిన్ లో సెటిలయ్యాడు. తను అవ్వాలనుకున్నది కాలేకపోయాడు.

ఇద్దరు పేద ఎస్టీ కుర్రాళ్ళ కథ:
తమ తమ తండాల్లో పదో తరగతి దాకా చదివిన అతి కొద్ది మందిలో ఒకరు. ఒకడు అత్తెసరు మార్కులతో, మరొకడు సగటు మార్కులతో పాసయ్యారు.  పాలిటెక్నిక్ ఎంట్రన్సు లో యాభైవేల లోపు ర్యాంకు ఒకడు, పదివేల లోపు ర్యాంకు మరొకడు తెచ్చుకున్నారు. 
రిజర్వేషన్ లేకపోతే ప్రభుత్వ కాలేజి లో ఖచ్చితం గా సీటు రాదు.
స్కాలర్షిప్పు కూడా బానే అందేది. ఇబ్బందులెదురైతే, విద్యార్ధి సంఘం సాయ పడేది (ఆర్ధికం గా కాదు).
ఒకడు కష్టపడి చదివాడు, ఇప్పుడు దేశం గర్వించదగ్గ ఒక రీసెర్చి సెంటర్ లో శాస్త్రవేత్త గా వున్నాడు.
మరొకడు ప్రభుత్వం ఇచ్చే ఉచిత వసతి, భోజన సదుపాయం, పాకెట్ మనీ, వీటికోసమే అన్నట్లుండేవాడు. ఒక్క సబ్జెక్టూ పాసైన దాఖలాలు లేవు. ఇప్పుడు రాజకీయాలలో తిరుగుతున్నాడు.

ముగ్గురూ కాలేజీ లో ర్యాగింగు కి గురయ్యారు. ఇక్కడ కూడా కులాల వారీ గానే ర్యాగింగు ఉండేది. కులాల వారీ గానే కొట్లాటలూ, గ్రూపులూనూ. అసహ్యకరమైన  పేర్లతో పిలవబడడమూ కులాలని బట్టే. (ఏ ఒక్క కులమూ ఇందులో మినహాయింపు కాదు).
ముగ్గురూ పేద వారే. కులాన్ని బట్టి ప్రభుత్వం సాయం చేసిందే కాని వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి, ప్రతిభని బట్టి కాదు. 

ఇలా రిజర్వేషన్ వల్ల ఇబ్బందులు పడ్డవాళ్ళూ, ఆసరాగా తీసుకుని ఎదిగిన వాళ్ళూ, అలుసుగా తీసుకుని పాడైన వాళ్ళూ కోకొల్లలు.అప్పుడే పుట్టిన ఒక బిడ్డ భవిష్యత్తు, తను పుట్టిన కులం ఆధారంగా మాత్రమే నిర్ణయింపబడడం దురదృష్టకరం.

రిజర్వేషన్లు ఎత్తేయాలని కొందరూ, ఆర్ధిక స్థితి ని బట్టి రిజర్వేషన్లు ఉండాలని కొందరూ అంటున్నారు, ఇంకా ఎన్నో వాదనలు  మీడియా లో వస్తున్నాయి. వీటిలో ఏది సరైనదో నాకు తెలీయదు కానీ , ప్రభుత్వమే ఎలాంటి కండీషన్లూ లేకుండా, అందరికీ, కేజీ టు పీజీ ఉచితం గా విద్యనందించాలి .  సీట్లు మాత్రం ప్రతిభ ఆధారం గానే ఇవ్వాలి అనే అలోచన బాగున్నట్లనిపిస్తోంది. పార్టీ లు విద్యార్ధుల జీవితాలని రాజకీయం చేయకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతం గా, అందరికీ న్యాయం జరిగేలా ఒక విధానాన్ని తీసుకు రావాలనుకోవడం, కుల-మతాలు అన్ని దరఖాస్తుల్లోంచి మాయమవ్వాలనుకోవడం, నా లాంటి సామాన్యుడికి  అత్యాశేనేమో.
గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో,