హోమ్

ముద్రితాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ముద్రితాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఆగస్టు 2017, బుధవారం

సంఘర్షణ

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (25/01/1998) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"నూరు పూలు వికసించనీ
వేయి ఆలోచనలు సంఘర్షించనీ " 


ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
సంఘర్షణ 

చుక్కల్లో ఆదర్శాలు లెక్కిస్తూ ,
మెరుపుల్లో ఆవేశాన్ని వీక్షిస్తూ ,
లక్ష్యాలను విస్మరించి,
మార్గం మరచి,
యువతా!,
ఈ ముళ్ల దారినా నీ సంచారం?
అపశృతులు నిండిన ఈ గేయాలా నీ సంగీతం?
కాల్చే ఆకలీ , కూల్చే వేదనా 
కనిపిస్తోందా ఈ గాయం?
ఏమైందీ?
స్వాతంత్ర్య సమరానికి ఊపిరులూదిన యువ చైతన్యం?
నవ భారత నిర్మాణానికి పునాది వేసిన ఆ సౌగంధం?
నవ కవనం-చైతన్యానికి
నవ భువనం - ఇనోదయానికి 
యువ యోధులు-అభ్యుదయానికి 
కావాలోయ్ సమాజానికి. 
నూరు పూలు వికసించనీ,
వేయి ఆలోచనలు సంఘర్షించనీ,
గుండె కొండల్లో శాంతి నాదాలు ప్రతిధ్వనించనీ ,
జగాన్ని క్రమ్మిన స్వార్ధ మేఘాలు పాటా పంచలవనీ,
విశ్వమంతా దేశ కీర్తిని మార్మ్రోగనీ ,
ఒక్క పుష్ప వికాసం చాలు వసంతాన్ని ఆహ్వానించేందుకు 
ఒక్క ఆలోచన చాలు ప్రజా హృదయం లో చైతన్యం నింపేందుకు
మరో ప్రస్థానం ఆరంభించేందుకు. 

22, ఆగస్టు 2017, మంగళవారం

స్వాగతించరేం?



ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (30/11/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?" 
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
స్వాగతించరేం?

మార్చేయండి మానవ నైజాన్ని,
తిరగరాయండి మానుష చరిత్రని. 
ఇదిగో, ఇక్కడ,
బూజు పట్టిన విధానాల్ని దులుపుకుంటూ,
నిశి రాత్రిని వెన్నెలగా చూపే 
గాజు కళ్ళని నులుముకుంటూ,
అర్ధశతాబ్ది స్వాతంత్ర్యాన్ని 
ఆనందంగా హత్తుకుంటూ,
దారిద్ర్యపు వెలుగులో 
గత వైభవాన్ని చూసుకుంటూ,
రాజకీయుల వాగ్దానాలని 
తృప్తిగా నెమరేసుకుంటూ ,
గుండె గాయాల్ని 
వైప్లవ్య గేయాలుగా మార్చుకుంటూ,
  సమరశంఖం పూరిస్తూ ,
గర్జిస్తూ ,
ప్రశ్నిస్తున్నాను. 
పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?
చైతన్యం కోసం ప్ర్రాణమివ్వని యువత శౌర్యమెందుకని?
బదులివ్వరేం?
భావిభారత బంగరు కలలని భుజానేసుకుని,
గంపెడాశతో వస్తున్నాను. 
స్వాగతించరేం?


1, ఫిబ్రవరి 2016, సోమవారం

తెలుగు వెలుగు లో నా కవిత

నేను ఏదైనా వ్రాయగలను అని నేను పదో తరగతి కొచ్చేవరకూ నాకే తెలియదు. నా స్నేహితుడొకడు నన్ను ఏడిపించడానికి ఒక కవిత వ్రాసి ఇచ్చాడు. ఉడుకుమోత్తనంతో నేనూ వాడి పై ఒక తవిక బరికేసాను. తొంభయ్యవ దశకం లో  చాలామంది మధ్య తరగతి టీనేజ్ పిల్లల్లాగే నేనూ కమ్యూనిస్ట్ భావాలకి దగ్గరయ్యాక, మరి కొద్దిగా వ్రాయడం మొదలైంది. చుట్టూ ఉన్నవాళ్ళు బాగానే ఉన్నాయ్ అంటున్నా, నా తవికలు ఎప్పుడూ ప్రచురణార్హమైనవి అనుకోలేదు. తొంభై ఏడు లో ఆలిండియా రేడియో విజయవాడ కి తప్ప ( ప్రసారమయ్యాయి కూడాను), ఎప్పుడూ ఏ పత్రికకీ పంప లేదు. వ్రాసిన ఇరవై ఏళ్ళకి, ఈ మధ్య మా నాన్న గారు చొరవ తీసుకుని పంపిస్తే, తెలుగు వెలుగు వాళ్ళు అచ్చేసి, యాభై రూపాయలు కూడా పంపారు.

ఆ 'కవనం' అనే తవిక లంకె ఇక్కడ. 

http://ramojifoundation.org/flipbook/201601/magazine.html#/20

ఈ తవిక చూసి నాలాగే మీకు నవ్వొస్తే, మీ తప్పు కాదు. చలం చెప్పినట్లు చాలా వాటికి క్షమించాలి నన్ను.