హోమ్

29, జనవరి 2016, శుక్రవారం

వెయ్యి కొట్టిన రామ్@శృతి.కామ్ - సమీక్ష

ఈ బ్లాగు మొదలు పెట్టిన తర్వాత వెయ్యి వీక్షణలు పూర్తి చేసుకున్న మొదటి టపా, రామ్@శృతి.కామ్ పై నేను రాసిన సరదా సమీక్ష.

వెయ్యి వీక్షణలు

28, జనవరి 2016, గురువారం

వివేచన

ఎన్ని జన్మాల దాస్యమో

సంసారమను కూపాన పడి

తెగ కలియ తిరిగాను.

ఏ జన్మలో పుణ్యమో

దాసోహమంటూ నీ పాదాల పై పడి

నిను శరణు వేడాను.

ప్రభూ!,

శివుడవో, కేశవుడవో,

విధాతవో, వేరొకరివో,

తల్లిని మించిన దైవం ఏదని

కరుణను మించిన ప్రార్ధన ఏదని

మనసుని మించిన మందిరమేదని

నాలోనే ఉండి నీ ప్రశ్నతో

నన్ను మనిషి గా మార్చావు.


25, జనవరి 2016, సోమవారం

కులమే అన్నిటికీ మూలమా?

రోహిత్ మరణం తర్వాత, ఎంతో మంది, ఎన్నో కోణాలలో విశ్లేషించారు. 
ఆ దృక్కోణాలన్నీ చూస్తున్నపుడు నన్ను తొలిచిన ప్రశ్నలు, 
కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరమా?
కులమే అన్నిటికీ మూలమా?

నా అనుభవంలోకొచ్చిన కొన్ని సంఘటనలు తలచుకొని, అలోచించడం మొదలు పెడితే..

దాదాపు పాతికేళ్ళ క్రితం మాట:
పేద ఓ.సి కుర్రాడి కథ:
పదో తరగతిలో 500 పైగా మార్కులతో పాసయ్యాడు. పాలిటెక్నిక్ ఎంట్రన్సు లో వంద లోపు ర్యాంకు తెచ్చుకున్నాడు. మెకానికల్ చదవాలనుకున్నా, జనరల్ కేటగిరీ లో సీటు దొరకలేదు.
ప్రైవేటు ఫీజులు చెల్లించలేక దొరికిన బ్రాంచి లోనే, ప్రభుత్వ కళాశాల లో చేరాల్సి వచ్చింది.
అయినా బాధ పడలేదు వాడు, అదే మహా భాగ్యమనుకొన్నాడు. తమ కులం వాళ్ళకే ఉచిత వసతి, భోజనం పెట్టే (ప్రైవేటు ఛారిటీ) హాస్టల్లో వుంటూ చదువుకున్నాడు.
కాలేజీ లో తనకు రావాల్సిన మెరిట్ స్కాలర్షిప్పు కూడా, వాళ్ళే మింగేస్తే, ఏ విద్యార్ధి సంఘమూ బాసట గా నిలవలేదు. (అప్పట్లో ఇప్పుడున్నన్ని సంఘాలు లేవేమో).
అయినా సమాజం లో ఉదార స్వభావుల సహాయంతో, పీజీ దాకా చదివాడు. ఈ ప్రభుత్వానికి తన లాంటి మెరిట్ విద్యార్ధులు అక్కరలేదేమో అనుకున్నాడు. ఫారిన్ లో సెటిలయ్యాడు. తను అవ్వాలనుకున్నది కాలేకపోయాడు.

ఇద్దరు పేద ఎస్టీ కుర్రాళ్ళ కథ:
తమ తమ తండాల్లో పదో తరగతి దాకా చదివిన అతి కొద్ది మందిలో ఒకరు. ఒకడు అత్తెసరు మార్కులతో, మరొకడు సగటు మార్కులతో పాసయ్యారు.  పాలిటెక్నిక్ ఎంట్రన్సు లో యాభైవేల లోపు ర్యాంకు ఒకడు, పదివేల లోపు ర్యాంకు మరొకడు తెచ్చుకున్నారు. 
రిజర్వేషన్ లేకపోతే ప్రభుత్వ కాలేజి లో ఖచ్చితం గా సీటు రాదు.
స్కాలర్షిప్పు కూడా బానే అందేది. ఇబ్బందులెదురైతే, విద్యార్ధి సంఘం సాయ పడేది (ఆర్ధికం గా కాదు).
ఒకడు కష్టపడి చదివాడు, ఇప్పుడు దేశం గర్వించదగ్గ ఒక రీసెర్చి సెంటర్ లో శాస్త్రవేత్త గా వున్నాడు.
మరొకడు ప్రభుత్వం ఇచ్చే ఉచిత వసతి, భోజన సదుపాయం, పాకెట్ మనీ, వీటికోసమే అన్నట్లుండేవాడు. ఒక్క సబ్జెక్టూ పాసైన దాఖలాలు లేవు. ఇప్పుడు రాజకీయాలలో తిరుగుతున్నాడు.

ముగ్గురూ కాలేజీ లో ర్యాగింగు కి గురయ్యారు. ఇక్కడ కూడా కులాల వారీ గానే ర్యాగింగు ఉండేది. కులాల వారీ గానే కొట్లాటలూ, గ్రూపులూనూ. అసహ్యకరమైన  పేర్లతో పిలవబడడమూ కులాలని బట్టే. (ఏ ఒక్క కులమూ ఇందులో మినహాయింపు కాదు).
ముగ్గురూ పేద వారే. కులాన్ని బట్టి ప్రభుత్వం సాయం చేసిందే కాని వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి, ప్రతిభని బట్టి కాదు. 

ఇలా రిజర్వేషన్ వల్ల ఇబ్బందులు పడ్డవాళ్ళూ, ఆసరాగా తీసుకుని ఎదిగిన వాళ్ళూ, అలుసుగా తీసుకుని పాడైన వాళ్ళూ కోకొల్లలు.అప్పుడే పుట్టిన ఒక బిడ్డ భవిష్యత్తు, తను పుట్టిన కులం ఆధారంగా మాత్రమే నిర్ణయింపబడడం దురదృష్టకరం.

రిజర్వేషన్లు ఎత్తేయాలని కొందరూ, ఆర్ధిక స్థితి ని బట్టి రిజర్వేషన్లు ఉండాలని కొందరూ అంటున్నారు, ఇంకా ఎన్నో వాదనలు  మీడియా లో వస్తున్నాయి. వీటిలో ఏది సరైనదో నాకు తెలీయదు కానీ , ప్రభుత్వమే ఎలాంటి కండీషన్లూ లేకుండా, అందరికీ, కేజీ టు పీజీ ఉచితం గా విద్యనందించాలి .  సీట్లు మాత్రం ప్రతిభ ఆధారం గానే ఇవ్వాలి అనే అలోచన బాగున్నట్లనిపిస్తోంది. పార్టీ లు విద్యార్ధుల జీవితాలని రాజకీయం చేయకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతం గా, అందరికీ న్యాయం జరిగేలా ఒక విధానాన్ని తీసుకు రావాలనుకోవడం, కుల-మతాలు అన్ని దరఖాస్తుల్లోంచి మాయమవ్వాలనుకోవడం, నా లాంటి సామాన్యుడికి  అత్యాశేనేమో.
గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో,