హోమ్

16, ఫిబ్రవరి 2016, మంగళవారం

కష్టం లో సంబరాలు

కష్టం వచ్చినప్పుడు మనిషి స్పందించే తీరు ఆ మనిషి వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం అంటారు.

కట్ టూ బందరు బస్టాండు:

            దాదాపు పాతికేళ్ళ క్రితం, బందరు బస్టాండులో విజయవాడ టికెట్ల క్యూ లో ఉన్నాన్నేను . జేబులో చిల్లిగవ్వ లేకపోయినా ఏ ధైర్యంతో క్యూ లో నిలబడ్డానో నాకే తెలియదు. సరిగ్గా అప్పుడొచ్చాడు అతను, "ఏంటి ఇక్కడ మా ఊళ్ళో? బెజవాడకేనా?" అని పలకరించి, తనతో పాటూ నాకూ టికెట్ తీశాడు. ఎక్కడో చూసినట్లుందే గానీ, ఎవరో గుర్తు రాలేదు చప్పున. అప్పటికే నేను అనారోగ్యం తో కాలేజీ కి దూరమై నెల పైనే అయ్యుంటుంది. దారి పొడుగునా ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఎవరో, ఏమిటొ అడిగే ధైర్యం చెయ్యలేదు నేను. ఎంతైనా టికెట్ కొన్నాడు గా మరి.

ఆ తర్వాత కాలేజీ లో మళ్ళీ కనబడ్డాడు, అప్పుడర్ధమయ్యింది, తను మా జూనియర్ అని. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి చాలా రోజులే పట్టింది నాకు. వాళ్ళ హాస్టలు కెళ్ళి ఇవ్వబోతే సున్నితం గా వారించాడు, నా అభ్యంతరాలన్నీ తేలిగ్గా కొట్టి పారేశాడు. ఆ పరిచయం అంతకన్నా ముందుకు పోలేదు ఆ రోజుల్లో.

కట్ టూ సంబరాలు:

             మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఐ.ఐ.టి ఎడ్మిషన్లలో కనిపించాడు. మా క్లాసే, మా హాస్టలే. అప్పుడే అతని గురించి మరింత తెలుసుకునే అవకాశం దొరికింది. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండేవాడు. సంబరాలు అనే ముద్దు పేరు కూడా సంపాదించాడు ఫ్రెండ్సర్కిల్లో . ఒక మనిషితో ఒక సారి మాట్లాడితే, ఎంత కాలమైనా ఆ మనిషిని పూర్తి వివరాలతో సహా గుర్తుంచుకోగలిగేవాడు. జీవితం మీద అతనికున్న దృక్పధం, కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం ఎంతో స్ఫూర్తిమంతం గా ఉండేది.

కట్ టూ ప్రెజెంట్:

        తర్వాతి కాలం లో ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడి, ఒక విదేశీ వనితని పెండ్లాడి, ఒక బిడ్డకి తండ్రయ్యాడు మా సంబరాల గంగాధర్. అంతటి ధైర్యశాలికి ఏ తండ్రికీ రాకూడని కష్టం వచ్చింది. 




గంగాధర్,రేచల్ దంపతుల గారాలపట్టి , మూడేళ్ళ సరస్వతి ప్రస్తుతం లుకేమియా తో పోరాడుతోంది. ఈ కష్టాన్ని కూడా అతను చిరునవ్వుతో నే ఎదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. .

ఇది సరస్వతి వైద్య ఖర్చుల నిమిత్తం ఏర్పాటు చేసిన "గో ఫండ్ మీ" పేజ్.
https://www.gofundme.com/24kun5uc

ఈ facebook పేజి సరస్వతి supporters కోసం
https://www.facebook.com/groups/1500390773601766/

 వదాన్యులు అందరూ ఆ దంపతుల కి బాసట గా నిలవాలని, చిన్నారి సరస్వతి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.






9, ఫిబ్రవరి 2016, మంగళవారం

ఏలిన వారి కరుణ

ఏలిన వారు ఆనందంగా ఉన్నారు. ఇలానే రాజ్యం చేస్తే మరో పది జన్మల దాకా అధికారం తమదేనని కార్యకర్తలంతా ముక్త కంఠంతో చెప్పి మరీ వెళ్ళారు.

అవును మరి కొత్త కొత్త పధకాలతో ప్రజలకి ఊపిరి సలపనంత మేలు చేస్తున్నాం, మనకి కాక మరి ఎవరికి కడతారు పట్టం?

భృత్యుడు దిగులుగా ఉన్నాడు. అయ్యా!ప్రజలు మీరనుకుంటున్నంత సంతోషం గా లేరన్నాడు.

ఎందుకన్నట్లు చూసారు ఏలినవారు.

"పక్క రాష్ట్రం తో పోలిస్తే మీ చరిష్మా తగ్గింది. మీ పధకాలు సరిగ్గా అమలు కావడం లేదు. కొందరు అమాత్యులు పబ్లిసిటీ లో మిమ్మల్నే మించి పోతున్నారు. కరెంటుబాధలూ, అందని పింఛన్లూ, రాని జాబులూ, పోయిన భూములూ ఇలా ఒకటేమిటి ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు ప్రజలు".

ఏలినవారు షాకవ్వలేదు సరికదా తమ స్టైల్లో ఒక  నవ్వు విసిరి ఇలా చెప్పారు.

"పిచ్చివాడా, ప్రజలకి కష్టాలు లేకుండా పరిపాలించిన వాడు మళ్ళీ అధికారం లోకి రాలేడు. వాళ్ళ కష్టాలు మనం తీరుస్తామనే ఆశ తోనే వాళ్ళు మళ్ళీ మనకి ఓటెయ్యాలి. అయినా 2050 కల్లా దేశం లోనే నంబర్ ఒన్ రాష్ట్రం అవుతుందని ప్రజలు గట్టి నమ్మకం తో ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళని ఆకర్షిస్తున్నాం, కాదంటే సభ లోంచి తన్ని తగలేస్తున్నాం, ఇక మనకి తిరుగు లేదు"

"కానీ భూములిచ్చిన వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నామనే బాధ తో ఉన్నారు"

ఏలినవారికి జాలేసింది.

"నీకు బలి చక్రవర్తి కథ తెలుసా?"

తెలుసన్నట్లు తలూపాడు భృత్యుడు.
"బలి చక్రవర్తి ని విష్ణుమూర్తి వామనావతారం లో వచ్చి, మూడడుగులు భూమి అడిగాడు. మూడవ అడుగు బలి చక్రవర్తి తల పై వేసి అతణ్ణి అంతం చేసాడు" ఆనందంగా చెప్పాడు భృత్యుడు.

"నీకు తెలియని విషయం చెప్తా విను" అనుగ్రభాషణం మొదలెట్టారు.

"బలి చక్రవర్తి ని వరుణ పాశంతో బంధించమని గరుడుని ఆదేశించాడు, విష్ణుమూర్తి. మూడవ అడుగు వేసిన తరువాత కూడా ఆ పాశం వీడలేదు. అప్పుడు బలి చక్రవర్తి తాత అయిన ప్రహ్లాదుడు  తన సర్వస్వమూ నీకే సమర్పించిన బలిని ఇంకా బాధించవద్దు, అతడిని విడువ వలసిందని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి
 
ఎవ్వని గరుణింప నిశ్చయించితిని వాని యఖిల విత్తంబు నే నపహరింతు 

అన్నాడు. రాజు విష్ణుమూర్తి తో సమానం అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి.  అంటే ఏమిటన్నమాట, ప్రజలని కరుణించాలంటే, ముందు వారి సంపదని మనమే అపహరించి, వారిని అశక్తుల్ని చేసి, ఆ తరువాత అనేకానేక పధకాలతో వాళ్ళని మనమే ఉధ్ధరించి, మళ్ళీ మళ్ళీ ఓట్లు దండుకోవాలన్న మాట.

మొత్తం రాజకీయ యోగం ఒకేసారి తెలుసుకున్నట్లు భృత్యుడి మొహం విప్పారింది.

నందో రాజా భవిష్యతి!!!

1, ఫిబ్రవరి 2016, సోమవారం

తెలుగు వెలుగు లో నా కవిత

నేను ఏదైనా వ్రాయగలను అని నేను పదో తరగతి కొచ్చేవరకూ నాకే తెలియదు. నా స్నేహితుడొకడు నన్ను ఏడిపించడానికి ఒక కవిత వ్రాసి ఇచ్చాడు. ఉడుకుమోత్తనంతో నేనూ వాడి పై ఒక తవిక బరికేసాను. తొంభయ్యవ దశకం లో  చాలామంది మధ్య తరగతి టీనేజ్ పిల్లల్లాగే నేనూ కమ్యూనిస్ట్ భావాలకి దగ్గరయ్యాక, మరి కొద్దిగా వ్రాయడం మొదలైంది. చుట్టూ ఉన్నవాళ్ళు బాగానే ఉన్నాయ్ అంటున్నా, నా తవికలు ఎప్పుడూ ప్రచురణార్హమైనవి అనుకోలేదు. తొంభై ఏడు లో ఆలిండియా రేడియో విజయవాడ కి తప్ప ( ప్రసారమయ్యాయి కూడాను), ఎప్పుడూ ఏ పత్రికకీ పంప లేదు. వ్రాసిన ఇరవై ఏళ్ళకి, ఈ మధ్య మా నాన్న గారు చొరవ తీసుకుని పంపిస్తే, తెలుగు వెలుగు వాళ్ళు అచ్చేసి, యాభై రూపాయలు కూడా పంపారు.

ఆ 'కవనం' అనే తవిక లంకె ఇక్కడ. 

http://ramojifoundation.org/flipbook/201601/magazine.html#/20

ఈ తవిక చూసి నాలాగే మీకు నవ్వొస్తే, మీ తప్పు కాదు. చలం చెప్పినట్లు చాలా వాటికి క్షమించాలి నన్ను.