హోమ్

20, ఏప్రిల్ 2016, బుధవారం

రాజకీయ బేతాళం

"మేంగో మేన్ సెంటర్ కి థ్యాంక్స్ చెప్పాడు తెలుసా" వస్తూనే అన్నాడు గిరి.
వాడికి రాజకీయాల పిచ్చి, ముఖ్యం గా ప్రముఖుల ఏకపక్ష ట్వీట్లు చూసి, అదే రాజకీయ సమాచారం అనుకునే వాళ్ళలో వీడు ఒకడు.
"ఇంతకీ ఈ మేంగో మేన్ ఎవరు? సెంటర్ కి థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు?" 
"ఇది కూడా తెలీదూ? ఆమాద్మీ ని ఆంగ్లీకరిస్తే మేంగో మేన్"
అప్పుడర్ధమయ్యింది వీడు దిల్లీ సిఎం నీళ్ళ ట్వీటు గురించి మాట్లాడుతున్నాడని. ఇది జరిగి చాలా రోజులయ్యిందిగా, ఇప్పుడెందుకా గోల, విసుగ్గా అన్నా. 
"కానీ నేనిప్పుడే చూశా. కాశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ ఇచ్చేవరకూ నేను ఇంటర్నెట్ వాడకుండా నిరసన వ్యక్తం చేశా" గొప్పగా చెప్పాడు వాడు.
వీడికి ఈ కళ కూడా ఉందా? ఆశ్చర్య పోవడడం నా వంతైంది.
"అయితే ఏంటిట?" అన్నా
"ఎప్పుడూ సెంటర్ ని తిట్టే నోరు ఒక్క సారే థ్యాంక్స్ చెప్తే విశేషం గాక మరేమిటీ?" అల్ప సంతోషి వీడు.
"అన్నీ భూతద్దం లో చూడకు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ, మిత్రులూ ఉండరు. నిన్న నితీష్-లాలూ లకి మద్దతిచ్చిన వాడు, రేపు మోదీ కి మద్దతివ్వకూడదని రూలేమీ లేదు. అన్నీ ఓ తాను ముక్కలే, ఈ విషయం తెలీక మనం సోషల్ మీడియా లో కొట్టుకు చస్తుంటాం."
మన్మోహన్ సింగు గట్టిగా మాట్లాడినట్టు ఉలిక్కి పడ్డాడు.
"నువ్వన్నది ససేమిరా జరగని పని. రాజకీయాల్లో నాకున్న నాలెడ్జి ని బట్టి చెబుతున్నా" అన్నాడు.
"అంత నాలెడ్జి ఉంటే నేనడిగే వాటికి సమాధానం చెప్పగలవా?" సవాల్ చేసాన్నేను.
"ఆ తప్పకుండా."
బేతాళ ప్రశ్నలు:
1) తన జీతాన్ని తానే అమాంతం పెంచేసుకున్న దిల్లీ సిఎం, సామాన్యుడి జీవన ప్రమాణాన్ని అమాంతం ఎందుకు పెంచలేదు?
2) విదేశాల్లో విపరీతం గా మాట్లాడే పిఎం స్వదేశం లో రోజు రోజుకీ పెరుగుతున్న సమస్యల పై ఎందుకు మాట్లాడటం లేదు?
3) ఉద్యమాల్లో నేతల కుటుంబాలు కాకుండా కేవలం విద్యార్ధులే ఎందుకు ఆత్మ హత్య చేసుకుంటారు?
4) లక్షల కోట్లున్న నాయకులు, ప్రజల కోసం సొంత డబ్బు ఒక్క పైసా కూడా ఎందుకు ఖర్చు పెట్టరు?
5) హైదరాబాదు ని ప్రపంచ పటం లో నిలిపానన్న బాబు, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు చావు దెబ్బ తిన్నాడు?
6) విదేశాల్లో చదువుకున్నాని చెప్పే రాహుల్ గాంధీ ఒక్క మీటింగు లో కూడా సరిగ్గా ఎందుకు మాట్లాడలేడు?
7) గడ్డి కుంభ కోణం లో శిక్ష పడ్డా కూడా, బీహార్ ప్రజలు లలూ పార్టీకే ఎందుకు ఓట్లేశారు?
8) యూనివర్సిటీల్లో జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యక్రమాలకి కొన్ని మీడియా వర్గాలు, పార్టీ లు ఎందుకు వత్తాసు పలుకుతున్నాయి?
9) సెంటర్ లో చక్రం తిప్పగలిగిన బాబు, ఆంధ్రా కి ప్రత్యేక హోదా ఎందుకు ఇప్పించ లేకపోతున్నాడు?
10)ప్రశ్నించడానికే పుట్టానన్న జన సేనాని, ఎందుకు చాలా విషయాల్లో మౌనంగా ఉంటున్నాడు?
సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ 3జి కనెక్షను కట్ చేస్తా అని హెచ్చరించాను.

"వీటన్నిటికీ సమాధానం నేను చెప్పగలను, విని అర్ధం చేసుకునే సత్తా నీలోఉందా?" అన్నాడు.

"సత్తా అంటే గుర్తొచ్చింది, రాజకీయ ప్రక్షాళణే ధ్యేయంగా గోదాలోకి దిగిన లోక్ సత్తా, ఎందుకు అస్త్ర సన్యాసం చేసింది?" మరో ప్రశ్న వేశా.

"నీకు నోస్ట్రడోమస్ తెలుసా? ఆయన ఆత్మ ని అడగి తెలుసుకోవాలి ఇవన్నీ. యండమూరి తులసిదళం నవల ఒకసారిద్దూ ఆత్మలతో మాట్లాడాలి". పలాయనం చిత్తగించాడు గిరి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి