హోమ్

4, ఏప్రిల్ 2012, బుధవారం

రంగుల మాయాబజార్

                    నా చిన్నప్పటి  నుంచి మాయాబజార్ సినిమా చాలా సార్లు చూసాను. కానీ రెండు ఏళ్ళ క్రితం రంగుల్లో చూసిన మాయాబజార్ మాత్రం మరపు రానిది. పాత సంగతే అయినా, ఇప్పటికీ మనసు లో తాజా గా వున్నజ్ఞాపకం ఇది.2004 లో మొఘుల్-ఎ-ఆజం రంగులలో వచ్చినప్పుడు నేను చూసాను కానీ అంతకు ముందు ఆ సినిమా నేను చూడక పోవడం వల్ల నాకు అంత గొప్పగా అనిపించలేదు (ఆ చిత్రాన్ని కించ పరచడం నా ఉద్దేశ్యం కాదు.). కానీ చిన్నప్పటినుంచి ఎన్నో సార్లు నలుపు తెలుపుల్లో చూసిన మాయాబజార్, తెలుగు సినిమా స్క్రీన్ ప్లే కే తల మానికమైన మాయాబజార్,  ని రంగుల్లో చూడడం ఒక మధురానుభూతి ని ఇచ్చింది. ఈ చిత్ర రాజాన్ని నిర్మించిన విజయా వారు చిరస్మరణీయులు. 53 ఏళ్ళ తరువాత రంగుల్లో కి మారుస్తారని అప్పటికి వాళ్ళకి తెలియక పోయినా, రంగుల్లో కూడా అద్భుతం గా ఉండేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని.
                    హాల్లో  కి వెళ్ళే ముందు, అంతా ఆ తరం వాళ్ళే వుంటారేమో అనుకున్నాను కాని హాలంతా పిల్లలు, యువతరం తో నే నిండి వుంది. మహానటి సావిత్రి, రేలంగి, యస్వీఆర్ పాత్రలు  తెర పై ప్రవేశించగానే జనం లేచి చప్పట్లు కొట్టారు. ఏ గ్రాఫిక్సూ లేని ఆ రోజుల్లో చేసిన గిమ్మిక్కులన్నీ చూడడానికి చాల బాగున్నాయి. మా కుటుంబం లోని పెద్దలంతా ఆ రోజులని తలచుకుని మురిసి పోయారు మరి పిల్లలైతే ఒకటే కేరింతలు ఘటోత్కచుని మాయాజాలం చూసి. అలనాటి చిత్రం లోని కొన్ని సన్నివేశాలు ఇందు లో లేవని తెలిసింది (రీలు కొంత మేర పాడవ్వడం వలన అట). కానీ ఈ తరానికి సరిపోయేలా రెండున్నర గంటలకి కుదించడం కూడా బాగుంది అది కూడా ఎక్కడా కధ లో లోటు తెలియకుండా. అక్కినేని , సావిత్రి ల జంట బహు ముచ్చట గా , టీనేజర్స్ లా వుంది అని కొందరు అనుకోవటం కూడా నా చెవుల పడింది.             
                    అలనాటి గొప్ప సినిమాలు ఇంకా కొన్ని రంగుల్లో వస్తే ఎంత బాగుంటుంది!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి