హోమ్

8, ఆగస్టు 2016, సోమవారం

మకుటమౌదాం


ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"ఎదల నడుమ ఎల్లలు లేని 
మానవీయతకు మకుటమౌదాం.
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.
మకుటమౌదాం
ఎవరో ఎక్కడో ట్రిగ్గర్ నొక్కుతారు,
వేలకొలదీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలసి పోతాయి.
ఎక్కడో ఒక చోట ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాటం జరుగుతూనే ఉంటుంది.
అయినా భువన భవనంపై శాంతి బావుటా ఎగురుతూనే ఉంటుంది.
ప్రపంచం ఆర్ట్ గ్యాలరీలోని అన్ని చిత్రాల్లోనూ మృత్యువే.
అన్ని ముఖాలలోనూ భయమే.

ఒకే పుడమి ఒడిలో, ఒకే నింగి నీడన నిదురించే
ప్రపంచ ప్రజలారా రండి.
గతాన్ని మరచీ,
మతాన్ని పూడ్చీ,
ఎల్లలు దాటీ రారండి.

ఏకమౌదాం,
వసుధైక కుటుంబం లో మమేకమౌదాం.
మనసుంటే చూసీ, ప్రేముంటే పంచీ, సమైక్య జీవన సౌందర్యానికి  ప్రతీకలౌదాం.
'నేను నాద'నే తమో మేఘాల్ని చీల్చి, 'మనం' అనే ఉదయభానుణ్ణి వీక్షిద్దాం.
కలసి ఉంటే కానిదేమిటి? ఏకమైతే పోయేదేమిటి?
మదర్ చిరునవ్వు సాక్షిగా,
భువి పై శాంతిని ఆవాహనం చేద్దాం.
కలనైనా యుద్ధమెరుగని ప్రశాంతతకు చేరువౌదాం.
మచ్చుకైనా ఈర్ష్య దొరకని సచ్ఛీలతకు నెలవౌదాం.
ఎదల నడుమ ఎల్లలు లేని మానవీయతకు మకుటమౌదాం.
కరడు గట్టిన స్వార్ధ హృదయాలని బ్రద్దలు చేసి,
మరో ప్రస్థానానికి నాందీ వాచకం పలుకుదాం రండి.

ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి