హోమ్

24, జనవరి 2018, బుధవారం

శ్రీశ్రీ ఇజం


క్రింది వీడియోలో చంద్రబోసు గారు తన పూర్వ కవుల గురించి అపూర్వమైన మాటలు చెప్పేరు.








వాటిలో నాకు బాగా నచ్చినవి శ్రీ శ్రీ గారి గురించి చెప్పిన మాటలు. 
"కవితయను కన్య కి, పోరాట పురుషునికి పెండ్లి చేసిన పురోహితుడు శ్రీ శ్రీ”. 

అప్పటికే విప్లవ సాహిత్యం ఉన్నా (అరసం, విరసం ఉన్నాయేమో తెలియదు), దాన్ని లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ లో కి లాక్కొచ్చి, ఉరుకులూ పరుగులూ పెట్టించాడు. ఉర్రూతలూగించాడు. చాలా మందిని విప్లవ సాహిత్యం చదవడానికి, రాయడానికి ప్రేరేపించాడు. యోగ్యతా పత్రం లో చెలం చెప్పినట్టు, "రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, ఝంఝానిల షడ్జధ్వానం" గుండెల్లో మోగించాడు.

పాతికేళ్ల నాడు, చాలా మంది దిగువ మధ్యతరగతి టీనేజర్ల లానే నేనూ ఆయన భావాలకి దగ్గరయ్యాను.
శ్రీ శ్రీ పడికట్టు పదాలు ఎంత గొప్పవంటే, నాలాంటి అర్భకులు కూడా,ఇప్పుడు, ఈ కాలం లోఆ పదాలను వాడినా, అచ్చు వేసేంత గొప్పవి. 
గతేడాది తెలుగు వెలుగు లో నా కవిత కేవలం ఆ పదాల వల్లే అచ్చైందనిపిస్తుంది.


శ్రీ శ్రీ  ని సరిగ్గా అర్ధం చేసుకున్నాడో లేదో కూడా తెలియకుండానే, కేవలం శ్రీ శ్రీ  రచనా శైలి తో గుడ్డి ప్రేమ లో పడిన అప్పటి టీనేజీ కుర్రాడి రచన ఇది. చదివాక నవ్వొస్తే మీ తప్పేం లేదు, చాలా వాటికి క్షమించాలి నన్ను.



మరో ప్రపంచపు జ్వాలల నుంచీ,
రుద్ర విపంచుల ధ్వానం నుంచీ,
రుధిరాక్షరాల సత్యం నుంచీ,
వేదం నుంచీ - స్వేదం నుంచీ,
ఖేదం నుంచీ - మోదం నుంచీ,
నాదం నుంచీ- గానం నుంచీ,
రాగం నుంచీ,
జాలు వారాలి కవనం,
కళ్ళు తెరవాలి జనం,
కుళ్ళి పోవాలి కులం,
పారిపోవాలి మతం,
అంతమవ్వాలి అన్యాయం,
వెల్లువెత్తాలి ప్రభంజనం,
భారతి కావాలి నందనవనం.


వీడియో సేకరణ : వాట్సాప్

23, ఆగస్టు 2017, బుధవారం

సంఘర్షణ

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (25/01/1998) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"నూరు పూలు వికసించనీ
వేయి ఆలోచనలు సంఘర్షించనీ " 


ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
సంఘర్షణ 

చుక్కల్లో ఆదర్శాలు లెక్కిస్తూ ,
మెరుపుల్లో ఆవేశాన్ని వీక్షిస్తూ ,
లక్ష్యాలను విస్మరించి,
మార్గం మరచి,
యువతా!,
ఈ ముళ్ల దారినా నీ సంచారం?
అపశృతులు నిండిన ఈ గేయాలా నీ సంగీతం?
కాల్చే ఆకలీ , కూల్చే వేదనా 
కనిపిస్తోందా ఈ గాయం?
ఏమైందీ?
స్వాతంత్ర్య సమరానికి ఊపిరులూదిన యువ చైతన్యం?
నవ భారత నిర్మాణానికి పునాది వేసిన ఆ సౌగంధం?
నవ కవనం-చైతన్యానికి
నవ భువనం - ఇనోదయానికి 
యువ యోధులు-అభ్యుదయానికి 
కావాలోయ్ సమాజానికి. 
నూరు పూలు వికసించనీ,
వేయి ఆలోచనలు సంఘర్షించనీ,
గుండె కొండల్లో శాంతి నాదాలు ప్రతిధ్వనించనీ ,
జగాన్ని క్రమ్మిన స్వార్ధ మేఘాలు పాటా పంచలవనీ,
విశ్వమంతా దేశ కీర్తిని మార్మ్రోగనీ ,
ఒక్క పుష్ప వికాసం చాలు వసంతాన్ని ఆహ్వానించేందుకు 
ఒక్క ఆలోచన చాలు ప్రజా హృదయం లో చైతన్యం నింపేందుకు
మరో ప్రస్థానం ఆరంభించేందుకు.