హోమ్

22, మార్చి 2013, శుక్రవారం

సమరం

కత్తులు దూసిన క్షణికావేశం
పుడమిని తడిమిన నెత్తుటి వర్షం   
అసువులు బాసిన జన సందోహం
అశ్రువులోడ్చిన మనసుల ఖేదం  
విజయం తో ఒక మది వీరంగం  
జయాపజయములు ఎవ్వరివైనా
సమరం ఇచ్చును తీరని శోకం.

19, జనవరి 2013, శనివారం

మాటలు బాబోయ్ మాటలు

పని లేని బిజీ రావు అసహనం గా ఛానెళ్ళు మారుస్తూ టివి ముందు కూర్చున్నాడు. 
  • టివి 29 : డెంటెడ్ అండ్ పెయింటెడ్ ముఖర్జీ గారి వ్యాఖ్యల మీద కొందరు అరుచుకుంటున్నారు.
  • టివి 55 : దోశా రావణ్ పాపి స్వామి వారు స్త్రీ రక్షణ గురించి అనుగ్రహ భాషణం మీద కొందరు కరుచుకుంటున్నారు.
  • దోషి టివి: మంత్రి గారు "క్రైములు మనకి చెప్పి చేస్తారా వాటిని ఎలా ఆపగలం" అని నాలిక కరుచుకున్న వైనం పై కాంచిపురపు బబ్రహ్మణ్యం కామెడీ షో.
  • మీ టివి2: వస్తున్నా పదవి కోసం యాత్ర పై స్పెషల్ కవరేజి.
  • బిబిఎన్ తెలుగు జ్యోతి: తెలుగు యువ కిశోరం పీకేష్ బాబు ట్వీట్లు, లోక కళ్యాణం పై రచ్చ ..సారీ చర్చ
సామాజిక నిస్పృహ కొంచెం ఎక్కువే వున్న బిజీ రావు కి ఇవన్నీ కొత్తగా అనిపించలేదు. ఇంత వయొలెంట్ వి కాకుండా కాస్త అమ్మయిలని, పువ్వులని చూద్దామని మళ్ళీ ఛానెల్ మార్చాడు. ఇప్పుడు:
  • మీ మ్యూజిక్: పక్కనే ఉన్న మీ ఫ్రెండ్సు కి మెస్సేజీ సెండ్ చెయ్యాలనుకుంటున్నరా అయితే ఇప్పుడే కాల్ చెయ్యండి అంటూ తెలుగు అమ్మాయి తెగులు గా ఆహ్వానిస్తోంది. 
వెంటనే రావుకి పక్కనే ఐపాడు లో కూత లు వింటూ ఊగిపోతున్న తన గాళ్ ఫ్రెండు లేహ్య గుర్తు వచ్చింది.వెంటనే లేహ్య కి ఒక మెస్సేజి పంపి, ఒక పాట ని డెడికేట్ చేసాడు.
  • శోకిని మ్యూజిక్: త్వరలో రాబోయే కామిని ఎస్సెమ్మెస్స్ 2 గురించి కాల్ ఇన్ ప్రోగ్రాం విత్ డోక్తా కపూర్ తెలుగు డబ్బింగు.
ఎస్సెమ్మెస్స్ అనగానే తను ఎస్సెమ్మెస్స్ చెక్ చేసుకుని ముప్ఫై సెకన్లు దాటి పోయిందని గ్రహించి వెంటనే మొబైల్ ఆన్ చేసాడు. ఇరవై ఏడు మెసేజీలు వెయిటింగ్. వాటిలో తనకి బాగా నచ్చిన ఎస్సెమ్మెస్స్ తన బడ్డీ రామకోటేశ్వర్రావు అలియాస్ రాక్ నుంచి:ఫేస్ బుక్ లో నా స్టేటస్ నచ్చక పోతే లైక్ చెయ్యి, నచ్చితే షేర్ చెయ్యి, ఏదీ కాకపోతే కామెంట్ చెయ్యి. వెంటనే ఫేస్ బుక్ లో వాడి స్టేటస్ చూసాడు.
"ఫోన్ లో ఫేస్ బుక్ చూసుకుంటూ  నడుస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళ ఆరడుగుల గోతి లో పడ్డా హిహిహి" ఇదీ వాడి  స్టేటస్. వెంటనే లైక్ చేసి, కామెంటి, వీడిని ఎవరైనా పైకి తీశారో లేదో అనుకుని, తీస్తే వాడే స్టేటస్ అప్డేట్ చేస్తాడ్లే అనుకుంటూ మళ్ళీ టివి పై దృష్టి సారించాడు.
  • శోకిని టివి: విస్తరాకులు కాంపిటీషన్ - విస్తరాకులు సీరియల్ కోటి ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రోజు ఎపిసోడ్ లో హీరోయిన్ ఏడుస్తూ  కాఫీ కలుపుతున్నప్పుడు ఎన్ని కన్నీటి చుక్కలు కప్పులో పడ్డాయి? మీ సమాధానాన్ని ఫలానా నెంబర్ కి పంపండి ఆ కప్పు ని గెలుచుకోండి.
              ఈ రోజు మన సమాజం లో చాలా మంది వెర్బల్ డయేరియా (నోరు పారేసుకోవడం) అనే వ్యాధి తో బాధ పడుతున్నట్లు అనిపిస్తోంది. మాట ని ఇష్టం వచ్చినట్లు వాడడం పరిపాటి అయ్యింది. పంచ్ డైలాగు (మాట) ల వల్ల రేంజి పెరిగిన హీరోలున్నారు అలానే మాట వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళూ వున్నారు. మాటల యుద్ధాల్ని ప్రసారం చేసే చానెళ్ళ రేటింగులు పెరుగుతున్నాయి. టివి, ఇంటర్నెట్ , సోషల్ నెట్ వర్క్స్, ఫోన్ ఇలా అన్నీ ఈ మాటలని మనకు చేరుస్తున్నాయి. 
               జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ,  జిహ్వాగ్రే మిత్ర బాంధవా:, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి:, జిహ్వాగ్రే మరణం ధ్రువం                         
              మాట మనిషి కి మాత్రమే వున్న శక్తి. మాట వల్ల ఏమైనా సాధించవచ్చు. దురదృష్ట వశాత్తూ మాట ని ఎలా వాడుకోవాలో, వాడుకోకూడదో చెప్పే చదువులు  ఈనాడు మనకు లేవు.
            సులభా: పురుషా రాజన్ సతతం ప్రియవాదిన: | అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ:||                               
          మారీచుడు రావణుడి తో అన్నట్లు, ప్రియమైన మాటలు చెప్పేవాళ్ళు సులభం గానే దొరుకుతారు, కాని మంచి మాటలు చెప్పే వాళ్ళు అంత సులభం గా దొరకరు, దొరికినా వినేవాళ్ళు వుండరు.

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పర నింద , ఆత్మ స్తుతి

                         ఏలిన వారు చిద్విలాసం గా టివి చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఏలిన వారి ఆశ్రిత పక్షపతాన్ని, కుంభకోణాల్నీ ఎండగడుతూ, గతం లో తమ పాలన లో దేశం ఎంత వెలిగిపోయిందో చెప్పుకుపోతున్నాడు. పక్కగా నిలబడ్డ భృత్యుడికి అనుమానం వచ్చింది, ఏలిన వారు ప్రతిపక్షం వాడు బండబూతులు తిడుతుంటే ఎలా ఆస్వాదిస్తూ  చూస్తున్నారా అని.అదే అడిగాడు. ఆయన మళ్ళీ ఒక చిరు నవ్వు విసిరి, "పిచ్చివాడా వాడు తిడుతున్నది నన్ను కాదు, రాజకీయాన్ని" అన్నాడు. అర్ధం కానట్లు చూశాడు. ఏలిన వారు అనుగ్రహ భాషణం మొదలు పెట్టారు, "నేడు పాలకుడికి ఉండవలసిన లక్షణాలలో పరనింద, ఆత్మస్తుతి ముఖ్యమైనవి. వీటి గురించి మహాభారతం లో చెప్పబడిన కథ నీకు చెబుతా విను".                          
 కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఒకానొక రోజు కర్ణుడు ధర్మ రాజుని తీవ్రం గా గాయ పరిచి, తల్లి కిచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు. ధర్మరాజు అవమాన భారం తో శిబిరానికి చేరాడు. అన్న గారు అర్ధంతరం గా శిబిరానికి వచ్చాడని తెలిసి, అర్జునుడు అన్న గారిని కలిసి విషయం అడిగాడు.  ధర్మరాజు కోపోద్రిక్తుడై "అర్జునా కర్ణుని చే తీవ్ర గాయాల పాలై  వచ్చాను. గతం లో నీవు చేసిన ప్రతిజ్ఞ కి కట్టుబడి వెంటనే కర్ణుని సంహరించు లేదా నీ గాండీవాన్ని వేరెవరికైనా ఇచ్చి నువ్వు తప్పుకో" అన్నాడు. వెంటనే అర్జునుడు కత్తి తీశాడు.అప్పుడు శ్రీకృష్ణుడు "ఇక్కడెవరూ శత్రువులు లేరే, ఎవరి పైకి ఈ కత్తి" అన్నాడు.అందుకు కిరీటి "కృష్ణా నన్నూ నా గాండీవాన్నీ వేరుచేసి ఎవరైనా మాట్లాడినా, గాండీవాన్నిఎవరైనా గేలి చేసినా వారిని చంపుతానని మనసు లోనే నేను ఒక శపధం చేసుకున్నాను. అందుకు ఇప్పుడు అన్నగారిని చంపబోతున్నాను " అన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుని శాంతపరచి ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. పెద్దలు,పూజ్యులు అయిన వారిని అకారణంగా నిందించిన మాత్రమున వారిని హతమార్చినట్లే. కనుక సత్య ధర్మ పరాయణుడైన ధర్మజుని నిందించి నీ శపధం నేరవేర్చుకోమన్నాడు. అర్జునుడు అన్నగారు చేసిన మంచి పనులన్నిటినీ చెడు పనులుగా చిత్రీకరించి అన్నగారిని దూషించాడు.                         
వెంటనే అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ ఏమయిందన్నాడు. "ఎవరి వలన మేము ఇంతవారమైనామో,ఎవరి సత్య ధర్మ నిష్ఠలు భావితరాలకు ఆదర్శప్రాయమో అట్టి అన్నగారిని నిందించి నేను ధర్మము తప్పాను. నా బ్రతుకు వ్యర్ధం, అందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను" అన్నాడు. అప్పుడు కృష్ణుడు మరొక ధర్మసూక్ష్మం చెప్పాడు. "ఆత్మ స్తుతి ఆత్మహత్యా సదృశం కనుక నీవు చేయని మంచి పనులని నీవే చేసినట్లుగా భావించి నిన్ను నువ్వే స్తుతించుకో" మన్నాడు.                
కాబట్టి ఎలాంటి కుంభకోణం అయినా, సమస్య అయినా మనం చేయవలసిందల్లా ప్రతిపక్షం వాడిని తిట్టడం, మన పాలనని మనమే పొగుడుకోవడం, తద్వారా సమస్యని పక్క దారి పట్టించడం. భృత్యుడు అయోమయంగా చూశాడు. "మరి ప్రతిపక్షం వాడూ ఆ పనే చేస్తున్నాడు కదా" అన్నాడు. 
ఏలిన వారు ధర్మ సూక్ష్మం చెప్పసాగారు.  అందరూ ఆత్మ స్తుతి వల్లనో పరనింద వల్లనో ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు మిగిలింది రాజకీయమే. రాజకీయానికి వ్యక్తులతో ప్రమేయం లేదు. మరి ప్రజలో అన్నాడు. ఏలిన వారి నవ్వు, ధర్మో రక్షతి రక్షిత: అన్నట్లుగా తోచింది. భృత్యుడి మొహం విప్పారింది.