హోమ్

23, జనవరి 2026, శుక్రవారం

1983: ఒక సంవత్సరం కాదు... ఒక చరిత్ర!

 కాలచక్రంలో కొన్ని సంవత్సరాలు వస్తాయి, వెళ్తాయి. కానీ కొన్ని సంవత్సరాలు మాత్రం చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేస్తాయి. అచ్చం అలాంటిదే 1983.

భారతదేశం గర్వంతో తలెత్తుకున్న సంవత్సరం అది. తెలుగు వాడి ఆత్మగౌరవం ఢిల్లీ పీఠాన్ని కదిలించిన సంవత్సరం అది. సామాన్యుడి కలలకు రెక్కలొచ్చిన సంవత్సరం అది.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే... ఎన్ని సంచలనాలు!



సంవత్సరం మొదట్లోనే ఒక ప్రభంజనం. "తెలుగు వారి ఆత్మగౌరవం" నినాదంతో, చైతన్య రథం పై ఎన్టీఆర్ ఊరూరా తిరిగితే, జనం నీరాజనం పట్టారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అది కేవలం రాజకీయ విజయం కాదు, తెలుగు జాతికి దొరికిన కొత్త గుర్తింపు.

అదే సంవత్సరం, వెండితెర మీద ఒక కొత్త చరిత్ర మొదలైంది. 'ఖైదీ' రూపంలో ఒక యువకుడు బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఆవేశం, యాక్షన్, స్టైల్... అన్నీ కలిపి చిరంజీవి అనే ఒక "సుప్రీం హీరో"కి పునాది పడింది అక్కడే. ఆ సినిమానే లేకపోతే ఈరోజు మనకు 'మెగాస్టార్' దొరికేవారో లేదో!

మరోవైపు, కళాత్మకతకు, కమర్షియల్ హంగులకు మధ్య ఒక అద్భుతమైన వంతెన కట్టారు కె. విశ్వనాథ్ గారు. కమల్ హాసన్ 'సాగరసంగమం' చూసి జాతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తం ముక్కున వేలేసుకుంది. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్లాసిక్ అది.

ఇక జూన్ 25, 1983... లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ ఆ కప్పుని చేతిలో పట్టుకున్న క్షణం. అప్పటివరకూ క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే. కానీ వెస్టిండీస్ లాంటి దిగ్గజాలను ఓడించి, టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన ఆ రోజు... క్రికెట్ ఈ దేశానికి ఒక మతమైపోయింది. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిన క్షణమది.

ఇవన్నీ ఒక ఎత్తైతే... సామాన్యుడి ఇంటి ముందు ఒక చిన్న కారు వచ్చి ఆగింది. అదే మారుతి 800. అప్పటివరకూ కారు అనేది కేవలం ధనికుల సొత్తు. కానీ మారుతి రాకతో మధ్యతరగతి మనిషి కూడా కారులో తిరగగలనని కలలు కనడం మొదలుపెట్టాడు. భారతీయ రోడ్ల రూపురేఖలు మారిపోయాయి.

రాజకీయాల్లో ఒక కుదుపు, క్రికెట్‌లో ఒక గెలుపు, సినిమాల్లో ఒక మలుపు, సామాన్యుడికి ఒక మెరుపు... అన్నీ 1983 లోనే!

నిజంగా... 1983 ఒక సంవత్సరం కాదు, అదొక ఎమోషన్! ఆ రోజులను చూసిన వారు అదృష్టవంతులు, వాటి గురించి చదువుతున్న మనం గర్వించదగిన వాళ్ళం.

3, జనవరి 2024, బుధవారం

గాయం

 


డెందం గాయపడుతోంది,
నువ్వు దూరమైపోతున్నందుకు.
హృదయం చిద్ర మౌతోంది,
ఆ దూరానికి కారణం నేనే అవుతున్నందుకు.
శక్తి యుక్తులు మోహరించి,
లెక్క లేనన్ని యత్నాలు,
నీ మనసు తలుపు మళ్ళీ తట్టేందుకు.
మనసు మరింత జారి పోతోంది,
నువ్వు ఇంకా దూరం జరుగుతున్నందుకు.
వీటన్నిటిని మించి, మెలిపెట్టే బాధ,
ఒక్క మొయిని మనసుకు ఉరేసి పోతోంది,
నీ ప్రతి చర్యా సబబే అనిపిస్తున్నందుకు.

29, ఆగస్టు 2023, మంగళవారం

తెలుగుభాషాదినోత్సవం

 

"జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశభాషలందు తెలుగు లెస్స

జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద

మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె"

(శ్రీనాధకవిసార్వభౌముని క్రీడాభిరామము నుండి)

అర్థము: అన్ని భాషలకు ఆద్యము సంస్కృతము. కానీ దేశభాషలందు తెలుగు ఉన్నతమైనది. తల్లిని మించిన సౌభాగ్య సంపద కల్గిన బిడ్డ ఎంతో గొప్పది కదా.


దేశభాషలందు తెలుగు లెస్స అన్న మొదటి మహానుభావుడు మన కవిసార్వభౌముడు శ్రీనాధుడు. ఆ వాస్తవాన్ని బలపరచినవాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయుడు. 

ఆయన వ్రాసిన పద్యమేమిటంటే :

"తెలుగదేల యన్న దేశమ్ము తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొల్వ ఎరుగనా బాసాడి

దేశభాషలందు తెలుగు లెస్స"

అయ్యా! తెలుగే ఎందుకంటే నా పాలిత ప్రాంతమే తెలుగు. నేను ఈ ఆంధ్ర భూమికి నేతను.సకల సామంత రాజులతో నేనొక్కడినే మాటలాడి తెలుసుకొన్నదేమిటంటే దేశ భాషలన్నిటిలో తెలుగు శ్రేష్టమైనది.